Raj Thackeray: ప్రముఖ సినీ నటులు వివేక్ ఒబెరాయ్, మాధవన్ లను టార్గెట్ చేశారు మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే. మోదీ ప్రభుత్వాన్ని నిత్యం ప్రశంసించే మీరు ఇండియాలో కాకుండా దుబాయ్ లో ఎందుకు ఉంటున్నారు అని రాజ్ ఠాక్రే వారిని ప్రశ్నించారు. ఓ సినిమాలో మోదీ పాత్రలో నటించిన వివేక్ ఒబెరాయ్ దుబాయ్ వెళ్లారు. ప్రధానిని ఎప్పుడూ కొనియాడే మరో నటుడు మాధవన్ కూడా దుబాయ్ లోనే ఉంటున్నారు. మోదీ భారత్ ను అభివృద్ధి చేస్తుంటే వారంతా ఇక్కడే ఉండొచ్చు కదా అని ఠాక్రే నిలదీశారు.
భారత దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం "అన్నీ అద్భుతంగా" చేసిందని భావిస్తుంటే, నటులు వివేక్ ఒబెరాయ్, ఆర్. మాధవన్ ఎందుకు దుబాయ్లో స్థిరపడ్డారని రాజ్ థాక్రే ప్రశ్నించారు. ముంబైలో MNS విద్యార్థి విభాగం 'మహారాష్ట్ర నవనిర్మాణ విద్యార్థి సేన' నిర్వహించిన ఒక కార్యక్రమంలో రాజ్ ఠాక్రే పాల్గొన్నారు. కేంద్రంపై నిప్పులు చెరిగారు. దేశంలోని వేలాది మంది పారిశ్రామికవేత్తలు తమ కార్యకలాపాలు ముగించుకుని దేశం విడిచి వెళ్లిపోయారని ఠాక్రే ఆరోపించారు.
2019లో ప్రధాని మోదీ బయోపిక్ విడుదలైంది. దీని గురించి ఠాక్రే ప్రస్తావించారు. "మోదీపై సినిమా తీసి, అందులో మోదీ పాత్రను పోషించిన వివేక్ ఒబెరాయ్ కూడా దుబాయ్లో నివసిస్తున్నారు," అని అన్నారు. ఇక, "ప్రధాని మోదీని ప్రశంసించిన ఆర్. మాధవన్ ఎక్కడ ఉంటున్నారు? ఆయన కూడా దుబాయ్లో ఉంటున్నారు. ఒకవేళ వారికి భారతదేశంపై అంత ప్రేమ ఉండి, ప్రధాని మోదీపై అభిమానం ఉండి, మోదీ భారతదేశాన్ని అభివృద్ధి చేస్తున్నారని వారు నమ్ముతుంటే.. వారు విదేశాల్లో ఎందుకు ఉంటున్నారు? తమ కుటుంబాలతో కలిసి దుబాయ్లో ఎందుకు నివసిస్తున్నారు?" అని ఠాక్రే ప్రశ్నించారు. "వారు ఇక్కడికి వచ్చి 'ధురంధర్' వంటి ప్రభుత్వ మద్దతు ఉన్న చిత్రాల్లో పని చేసి, ఆ తర్వాత తిరిగి దుబాయ్కి వెళ్లిపోతారు," అని ఆయన ఆరోపించారు.
కోవిడ్-19 మహమ్మారి సమయంలో తన కుమారుడి స్విమ్మింగ్ కెరీర్ కోసం దుబాయ్ కి మారినట్లు ఆర్. మాధవన్ చెప్పగా, తన వ్యాపారం కోసం దుబాయ్కి వెళ్ళినట్లు వివేక్ ఒబెరాయ్ తెలిపారు.
ఇక, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో జరిగిన నిరసనల్లో ప్రధాని మోదీపై ఉపయోగించిన భాష అనుచితంగా ఉందని రాజ్ ఠాక్రే సైతం అంగీకరించారు. "దారి తప్పిన ఇలాంటి పిల్లలను" క్షమించి, సరైన మార్గంలో నడిపించాలన్న ప్రధాని వ్యాఖ్యను ప్రస్తావిస్తూ, "నేను ప్రధాని వ్యాఖ్యతో ఏకీభవిస్తున్నాను. ఇంత నీచమైన భాషను ఎవరూ ఉపయోగించకూడదు. కానీ ఆయన తన సొంత పార్టీ ప్రజలకు ఈ విషయం చెప్పాలి. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ మొదలుకొని ఠాక్రేల వరకు, ప్రముఖులను సైతం బీజేపీ ట్రోల్స్ లక్ష్యంగా చేసుకుంటారని'' అన్నారు. ట్రోల్ చేస్తారనే భయంతో తమ అభిప్రాయాలను తెలపకపోవడమే మంచిదని చాలా మంది నటులు అంటున్నారని ఆయన వెల్లడించారు.












