ఏపీ ప్రజలకు కూటమి సర్కార్ మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో డీమార్టులకు పోటీగా ‘మీ మార్టు’లను ప్రారంభిస్తామని.. అందులో నాణ్యమైన నిత్యావసర వస్తువులను తక్కువ ధరలకే అందిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.పెరుగుతున్న ధరల నుంచి సామాన్యులకు ఊరట కల్పించేందుకు సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.రాష్ట్రంలోని 150 రైతు బజార్లలో రూ.52కే బీపీటీ బాయిల్డ్ రైస్ను విక్రయించేందుకు నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.
ప్రస్తుతం మార్కెట్లో స్టీమ్ రైస్ ధరలు ఎక్కువగా ఉన్నాయని.. అయినప్పటికీ ప్రభుత్వం ప్రత్యేక చొరవ ద్వారా కిలో బియ్యాన్ని కేవలం రూ.52లకే సబ్సిడీ ధరపై అందించేందుకు సిద్ధమైందని తెలిపారు. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయి సహకారం అందిస్తున్నదని వెల్లడించారు. ప్రస్తుతం ప్రజలు డీ-మార్ట్లో విక్రయాలు కొనసాగిస్తుండగా.. ‘మీ-మార్ట్’ ద్వారా అతి తక్కువ ధరకే నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తామని.. అందుకే మీ మార్టులను తీసుకొస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టంచేశారు.
ఏపీ వ్యాప్తంగా ముందుగా 553 మినీ మీ-మార్టులను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. మీ మార్టుల్లో 64 రకాల నిత్యావసర వస్తువులను బహిరంగ మార్కెట్ కంటే చాలా తక్కువ ధరలకే విక్రయించనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం వెయ్యి మినీ మీ-మార్టుల ఏర్పాటు కోసం ఇప్పటికే ఒప్పందాలు పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. సామాన్యుడిపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు కూటమి సర్కార్ కృషి చేస్తున్నదని పేర్కొన్నారు.












