ఏపీలోని పొగాకు రైతులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాయి. ఒక్కో బార్న్కు రూ.50 వేల వడ్డీలేని రుణంతో పాటు తక్కువ గ్రేడ్ పొగాకుకు కిలోకు రూ.10చొప్పున ఆర్థిక అందించనున్నట్లు ప్రకటించాయి. మార్కెట్లో సప్లై-డిమాండ్ వ్యత్యాసాలను అధిగమించి, రైతులు నష్టపోకుండా రక్షించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించి, క్రితం ఏడాదితో పోలిస్తే ఏకంగా 94 మిలియన్ కిలోల మేర అదనంగా పంట ఉత్పత్తి జరగడంతో దాదాపు 236 మిలియన్ కిలోల పొగాకు దిగుబడి వచ్చింది.
అయితే, ఆగస్టు ప్రారంభం నాటికి ఇందులో కేవలం 20శాతం మాత్రమే విక్రయమవ్వడంతో నిల్వలు పేరుకుపోయి రైతులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. ఈ క్లిష్ట పరిస్థితిని అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ఎఫ్సివి పొగాకు రైతులందరికీ ఒక్కో బార్న్కు రూ.50వేల చొప్పున వడ్డీ లేని నిర్వహణ మూలధన సాయాన్ని ప్రకటించింది. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 45వేల మంది రైతులకు తక్షణ ప్రయోజనం చేకూరనుంది. కేంద్రం అందిస్తున్న ఈ రుణ సదుపాయం రైతులకు తక్షణ పెట్టుబడి అవసరాలకు గొప్ప ఉపశమనంగా నిలవనుంది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రైతుల వైపు నిలబడుతూ కేజీకి రూ.10 చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది. మార్కెట్లో తక్కువ నాణ్యత కలిగిన 'ఆఫ్-స్టైల్' పొగాకుకు ధర లభించక ఇబ్బంది పడుతున్న దాదాపు 94 మిలియన్ కిలోల పంటకు ఈ ప్రోత్సాహకాన్ని నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేయనున్నారు. వేలం కేంద్రాల వద్ద ఎలాంటి అక్రమాలు జరగకుండా నిష్పక్షపాతంగా గ్రేడింగ్ ప్రక్రియ నిర్వహించేందుకు అధికారులు, రైతులు, వ్యాపార వర్గాలతో కూడిన ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు.
ప్రస్తుత మార్కెట్ సంక్షోభాన్ని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని పొగాకు బోర్డు రాబోయే 2026-27 సంవత్సరానికి పొగాకు పంట పరిమాణాన్ని భారీగా నియంత్రించింది. అధీకృత పంట ఉత్పత్తి పరిమితిని ఏకంగా 81 మిలియన్ కిలోగ్రాములకు తగ్గిస్తున్నట్లు స్పష్టం చేసింది. భవిష్యత్తులో రైతులు మళ్లీ ఇలాంటి మార్కెట్ పతనానికి గురికాకుండా నివారించేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వాలు ప్రకటించిన ఈ సంయుక్త సహాయక ప్యాకేజీ ద్వారా ఏపీ పొగాకు రైతులకు పెద్ద ఎత్తున ఊరట లభించినట్లయింది.












