దేశాన్ని మాదకద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. శనివారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ‘నషా ముక్త్ యువ ఫర్ విక్సిత్ భారత్ సంకల్ప్’ అభియాన్ను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు డ్రగ్స్ రహిత, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 100 వారాల పాటు సాగే భారీ 'జన్ భాగిదారి' ప్రచార ఉద్యమం మొదలైంది. ప్రధాని పిలుపుతో దేశంలోని 10,000కు పైగా ప్రాంతాల నుంచి లక్షలాది మంది యువత వర్చువల్గా అనుసంధానమయ్యారు. ఇందులో మై భారత్ వాలంటీర్లు, ఎన్ఎస్ఎస్ ప్రతినిధులు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు మరియు 125కు పైగా ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థల భాగస్వామ్యం లభించింది.
ఈ అభియాన్ కింద రాబోయే 100 వారాల పాటు ప్రతి ఆదివారం దేశంలోని వివిధ ప్రాంతాలలో విస్తృత అవగాహన కార్యక్రమాలను రూపొందించనున్నారు. క్రీడా పోటీలు, వాక్థాన్లు, ధ్యాన శిబిరాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, అవగాహన ర్యాలీలు, వీధి నాటకాలు (నుక్కడ్ నాటకాలు) మరియు చర్చా వేదికల ద్వారా డ్రగ్స్ మహమ్మారి వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రజలను చైతన్యపరచనున్నారు.
యువతను కేవలం వ్యసనాలకు దూరంగా ఉంచడమే కాకుండా, సమాజంలో సానుకూల మార్పు తెచ్చే నాయకులుగా మార్చడమే ఈ ప్రచారం ముఖ్య ఉద్దేశమని స్పష్టమైంది. భవిష్యత్తు భారతాన్ని అగ్రగామిగా నిలిపే క్రమంలో యువశక్తి కీలకమని, మాదకద్రవ్యాల నిర్మూలన ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ప్రధాని స్పష్టం చేశారు. నాణ్యమైన మానవ వనరుల అభివృద్ధితోనే 'వికసిత్ భారత్' కల నెరవేరుతుందని ఆయన ఉద్ఘాటించారు.












