ఢిల్లీలోని జంతర్ మంతర్ నిరసనలో ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాలిక పశ్చాత్తాపం వ్యక్తం చేయడంతో మోదీ ఆమెను క్షమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ స్పందనపై బాలిక తల్లి తీవ్ర భావోద్వేగానికి గురవుతూ, ప్రధాని తన కుమార్తెకు పునర్జన్మనిచ్చారని కృతజ్ఞతలు తెలిపారు. జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీపై అత్యంత వివాదాస్పద శైలిలో వ్యాఖ్యలు చేసిన వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.
ఈ ఘటన అనంతరం సదరు బాలిక క్షమాపణ కోరుతూ ఒక ప్రత్యేక వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసింది. తాను తీవ్రమైన తప్పు చేశానని, ఇతరుల ప్రభావానికి లోనై తొందరపాటుతో అలా మాట్లాడానని పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ దేశ ప్రజలందరికీ క్షమాపణలు చెప్పింది. తాను చేసిన పనికి సొంతంగా ముఖం చూపించుకోవడానికే సిగ్గుగా ఉందని, ఇదే తన మొదటి, చివరి తప్పిదమని వేడుకుంది.ఈ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఎంతో ఉదారంగా స్పందించారు.
దారి తప్పిన యువతపై కోపం, ప్రతీకార చర్యల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, వారిని శిక్షించడం కంటే సరైన మార్గంలో నడిపించడమే సమాజ బాధ్యత అని ఆయన పిలుపునిచ్చారు. బాలిక చేసిన వ్యాఖ్యలను తాను క్షమిస్తున్నట్లు ప్రకటించి పెద్ద మనసు చాటుకున్నారు. ప్రధాని నిర్ణయం పట్ల బాలిక తల్లి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన బిడ్డ చేసిన పెద్ద తప్పును మన్నించి, ఆమె పుట్టినరోజు నాడే గొప్ప ‘జీవనదానం’ ప్రసాదించారని మోదీకి చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపారు.
ఎఫ్ఐఆర్లో 15ఏళ్లకు బదులుగా 25ఏళ్లు
జూలై 23న జరిగిన ఈ ఘటన ఆధారంగా నోయిడా పోలీసులు నమోదు చేసిన జీరో ఎఫ్ఐఆర్ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్కు బదిలీ అయిన విషయం తెలిసిందే. ఈ ఎఫ్ఐఆర్లో తన కుమార్తె వయసును 15ఏళ్లకు బదులుగా 25ఏళ్లుగా తప్పుగా నమోదు చేశారని తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న పిల్లలను ఇలాంటి నిరసనలకు దూరంగా ఉంచాలని, మైనర్ల మానసిక ఆరోగ్యం దృష్ట్యా 20 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై నియంత్రణలు తీసుకురావాలని ఆమె ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
మరోవైపు, ఈ మొత్తం వ్యవహారంపై రాజకీయంగా విమర్శలు గుప్పించారు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) అధ్యక్షుడు అభిజీత్ దీప్కే. ప్రధాని మోదీ ఇన్ స్టాగ్రామ్ వీడియోపై మండిపడుతూ.. "కేవలం రీల్స్ లో మాత్రమే క్షమిస్తారా? లేక ఆమెపై నమోదైన పోలీసు కేసులను కూడా పూర్తిగా వెనక్కి తీసుకుంటారా?" అని ప్రశ్నించారు. కేవలం సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యానించడమే కాకుండా, సదరు బాలికపై ఉన్న చట్టపరమైన కేసులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.












