తెలంగాణలో ఎంతో ప్రసిద్ధి చెందిన సికింద్రాబాద్ లష్కర్ బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. చారిత్రాత్మక ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి నైవేద్యంగా బోనం సమర్పించేందుకు ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తజనం ఆలయానికి పోటెత్తారు. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, 'జై మహంకాళి' నినాదాలతో సికింద్రాబాద్ వీధులన్నీ హోరెత్తిపోతున్నాయి. ఆలయ ప్రాంగణం భక్తుల రద్దీతో కిక్కిరిసిపోవడంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.
ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తొలి బోనం, పట్టువస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. సాధారణ భక్తుల దర్శనం కోసం మూడు ప్రత్యేక క్యూలైన్లు, బోనాలు ఎత్తుకుని వచ్చే మహిళల కోసం రెండు ప్రత్యేక మార్గాలు, వీఐపీల కోసం మరో మార్గాన్ని కేటాయించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం సుమారు 1,500 మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
బోనాల పండగ జాతర మహోత్సవాల్లో భాగంగా ఆదివారం భక్తులు అమ్మవారికి నైవేద్యంగా బోనాలను సమర్పిస్తుండగా, సోమవారం ఉదయం అత్యంత కీలకమైన 'భవిష్యవాణి' (రంగం) కార్యక్రమం జరగనుంది. స్వదేశీ, విదేశీ విశేషాలను ఆలయ జోగిని వినిపించే ఈ ఘట్టం కోసం భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ తదనంతరం అత్యంత వైభవంగా ఏనుగు అంబారీపై అమ్మవారి శాంతి ఊరేగింపు, ఘటాల ఊరేగింపు నిర్వహించడంతో ఈ వార్షిక ఉత్సవాలు ముగుస్తాయి.
కాగా, జాతర మహోత్సవాల నేపథ్యంలో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో వాహనదారులు ఇబ్బంది పడకుండా పోలీసులు పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నెల 4వ తేదీ ఉదయం వరకు ఆలయానికి రెండు కిలోమీటర్ల పరిధిలో రాకపోకలను మళ్లిస్తున్నట్లు ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ తెలిపారు. పొగాకుబజార్, సుభాష్ రోడ్, జనరల్ బజార్ మార్గాలను పూర్తిగా మూసివేశారు. ఆర్టీసీ బస్సులు, రైల్వే స్టేషన్కు వెళ్లే ప్రయాణికులు కర్బాలా క్రాస్రోడ్స్, రాణిగంజ్, మినిస్టర్ రోడ్, గోపాలపురం మార్గాలను ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకోవాలని సూచించారు.












