అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ మీద సైనిక దాడులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ట్రంప్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'ట్రూత్ సోషల్' వేదికగా పోస్టు చేశారు. రెండో ప్రపంచయుద్ధం తర్వాత ఏనాడూ లేని స్థాయిలో అత్యంత శక్తివంతమైన సైనిక దాడికి అమెరికా పూర్తి సిద్ధంగా ఉన్నదని.. ఇరాన్, ఇతర మధ్యప్రాచ్య దేశాల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.
దౌత్యపరమైన ఒప్పందానికి సంబంధించిన ప్రాథమిక చట్టం సిద్ధం అయిందని, అందుకే ఇరాన్ మీద దాడులను నిలిపివేయాలని మధ్య ప్రాచ్యంలోని తమ మిత్రదేశాలు కోరినందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. నూతన ఒప్పంద ప్రతిపాదనల్లో హార్ముజ్ జలసంధిని తక్షణమే, సంపూర్ణంగా పునరుద్ధరించడంతో పాటు ఇరాన్ అణు కార్యక్రమాలకు శాశ్వత ముగింపు పలకటం దీనిలో ప్రధాన అంశాలుగా ఉన్నాయని ట్రంప్ స్పష్టం చేశారు.
వీలైనంత త్వరగా ఒప్పందం కుదిరేలా చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. షరతులకు లోబడే ఒప్పందం ఉంటుందని, ప్రపంచ భవిష్యత్, ఇరాన్ మనుగడ దృష్ట్యా ఈ దాడులను రద్దు చేసేందుకు అంగీకరించినట్టు ట్రంప్ మరోసారి స్పష్టంచేశారు. అమెరికా తీసుకున్న నిర్ణయానికి ఇజ్రాయెల్ మద్దతుగా నిలిచిందని, మిడిల్ ఈస్ట్ దేశాలు ఒప్పందం కుదిరేలా చొరవ చూపడం, త్వరితగతిన ఒప్పందాన్ని పూర్తికి ఇరాన్ అడుగులు వేయాలని ట్రంప్ తెలిపారు.












