ప్రస్తుతం సమాజంలో ప్రమాదకరంగా మారిన పదం సెల్ ఫోన్.. మొదట్లో పిల్లలు ఏడవకుండా ఉండాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు ఫోన్ చేతిలో పెట్టారు. భోజనం చేయించాలన్నా, ఇంట్లో పనులు చేసుకోవాలన్నా, బయటకు వెళ్లాలన్నా.. కాసేపు ఫోన్ ఇస్తే ప్రశాంతంగా ఉంటారని భావించారు. కానీ అదే అలవాటు క్రమంగా వ్యసనంగా మారిపోయింది.
ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే. ఫోన్ లేకపోతే కొంతమంది పిల్లలు భోజనం కూడా చేయడం లేదు. కార్టూన్లు, వీడియోలు, మొబైల్ గేమ్స్, షార్ట్ వీడియోలు... వీటికే గంటల తరబడి అతుక్కుపోతున్నారు. దీంతో చదువుపై ఏకాగ్రత తగ్గడం, బయట ఆటలకు దూరమవడం, కుటుంబ సభ్యులతో మాట్లాడే సమయం తగ్గిపోవడం, చిరాకు, కోపం, హైపర్ యాక్టివ్ ప్రవర్తన వంటి సమస్యలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలకు ఫోన్ అడిక్షన్ ప్రమాదాన్ని అర్థమయ్యేలా చేయడానికి ఓ నర్సరీ స్కూల్ టీచర్లు వినూత్న ప్రయత్నం చేశారు. ఒక చిన్న స్కిట్ ద్వారా ఫోన్ను అతిగా ఉపయోగిస్తే కళ్లకు నష్టం జరుగుతుందని చూపించారు. స్కిట్లో ఓ టీచర్ చిన్నారి పాత్రలో, మరో టీచర్ తల్లి పాత్రలో, ఇంకొకరు డాక్టర్ పాత్రలో నటించారు.
ఫోన్లోనే మునిగిపోయిన చిన్నారికి చివరకు కంటి సమస్య వచ్చి ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తుంది. పరీక్షించిన డాక్టర్ ఆపరేషన్ చేయాల్సి ఉందని చెప్పి కళ్లకు కట్టు కడతారు. ఈ సన్నివేశాన్ని చూసిన చిన్నారులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. టీచర్లు ఫోన్ చేతికి ఇవ్వడానికి ప్రయత్నించగానే.. వద్దు అంటూ భయంతో వెనక్కి తగ్గారు. కొందరు పిల్లలు ఏడవడం కూడా ప్రారంభించారట.
కాగా ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు పిల్లల్లో ఫోన్ వ్యసనం తగ్గించేందుకు ఇది అద్భుతమైన ఆలోచన అంటున్నారు. మరికొందరు మాత్రం చిన్న వయసులో ఇంతగా భయపెట్టడం సరైంది కాదని, అవగాహన కల్పించడం మంచిదే కానీ భయంతో కాదు.. ప్రేమతో ఫోన్ వినియోగాన్ని నియంత్రించడం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల బాధ్యత అని అభిప్రాయపడుతున్నారు. వారిని టెక్నాలజీకి దూరం చేయడం కాదు.. దానిని ఎంతవరకు, ఎలా ఉపయోగించాలో నేర్పించడమే ఈ తరం పిల్లలకు అత్యంత అవసరం..












