బీఆర్ఎస్ హయాంలో గత పదేండ్లు మంత్రిగా చక్రం తిప్పిన కీలక నేత, ప్రస్తుత మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పార్టీని వీడనున్నారని తెలుస్తున్నది. అందుకే గత కొంతకాలంగా పార్టీకి అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. ఆయన దారిలోనే మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రిరాజశేఖర్ రెడ్డి సైతం పార్టీని వీడుతారని తెలుస్తోంది. వీరు త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరుగుతోంది.
తమ విద్యాసంస్థలు, వ్యాపారసంస్థలను కాపాడుకునేందుకే మాజీ మంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి ఆయన దూరంగా ఉంటున్న విషయం ఇప్పటికే పార్టీ పెద్దలకు సైతం తెలుసునని టాక్. తనను పార్టీ కార్యక్రమాలకు పిలువద్దని, రాలేనని అర్థం చేసుకోవాలని కేడర్, పార్టీలోని ముఖ్య నేతలకు మల్లారెడ్డి ఇప్పటికే హింట్ ఇచ్చినట్టు తెలిసింది.
మల్లారెడ్డి కుటుంబం తొలుత కాంగ్రెస్లోకి వెళుతుందని అంతా భావించారు.కానీ, సీఎం రేవంత్ మీద గతంలో మల్లారెడ్డి చేసిన కామెంట్స్, పార్టీ మీద చేసిన వ్యాఖ్యలతో సీనియర్లు వద్దని చెప్పినట్టు సమాచారం. బీఆర్ఎస్ అధికారం కోల్పోవడం, సీఎంగా రేవంత్ రెడ్డి అవ్వడంతో మల్లారెడ్డి ఫ్యామిలీ గత కొంత కాలంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టు సమాచారం. అందుకే ఆయన ప్రభుత్వానికి సరెండర్ అయ్యారంటూ టాక్ వినిపిస్తోంది. అయినా అధికారికంగా పార్టీ మారలేదు.
గులాబీ పార్టీలోనే ఉన్నారు.కండువా మోస్తున్నారు.కానీ, అధికార పార్టీకి వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ ఇవ్వడం లేదు. తన కోడలు ఇటీవల బీజీపీ స్టేట్ లీడర్లను కలవడం, ఢిల్లీలో పార్టీ పెద్దలను సైతం కలిశారు. ఫలితంగా వారికి కేంద్రం నుంచి అభయహస్తం లభించినట్టు తెలిసింది. దీంతో వచ్చేనెల మల్లారెడ్డి, ఆయన అల్లుడు, కోడలు బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని టాక్ వినిపిస్తోంది. శ్రావణంలో పార్టీలో పెద్దఎత్తున చేరికలు ఉంటాయని స్టేట్ బీజేపీ ఇన్చార్జి అభయ్ పాటిల్ ప్రకటించడంతో ఈ వాదనలకు మరింత బలం చేకూరినట్టు అయ్యింది.












