తలచుకున్నా ముక్తిని ప్రసాదించే దివ్యక్షేత్రంగా అరుణాచలానికి అపారమైన ఆధ్యాత్మిక విశిష్టత ఉంది. పరమశివుని తేజోలింగ స్వరూపంగా భావించే ఈ క్షేత్రానికి ప్రతి పౌర్ణమి రోజున లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. గిరిప్రదక్షిణతో పాటు అత్యంత ఇరుకైన మోక్షమార్గం గుండా వెళ్తే జన్మరాహిత్యం, మోక్షప్రాప్తి కలుగుతుందని చాలామంది భక్తులు నమ్ముతారు.. ఆ విశ్వాసంతోనే ఎంతటి కష్టమైనా భరిస్తూ, ప్రమాదాన్ని సైతం లెక్కచేయకుండా ఆ మార్గంలో వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటారు.
అయితే, ఈ మోక్షమార్గం ఎంతో ఇరుకుగా ఉండటంతో గతంలో అనేక ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. భక్తులు ఇరుక్కుపోవడం, ఊపిరి ఆడక తీవ్ర అస్వస్థతకు గురికావడం వంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి.. ముఖ్యంగా గత వారం ఒక భక్తుడు మోక్షమార్గంలో ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. పుణ్యక్షేత్రానికి దర్శనం కోసం వచ్చిన భక్తుడు ప్రాణాలు కోల్పోవడం ప్రతి ఒక్కరినీ కలచివేసింది. ఆ తర్వాత ఒక మహిళా కూడా ఇదే ఇబ్బందిని ఎదుర్కొంది.
ఈ సంఘటన తర్వాత భక్తుల భద్రతపై పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో తమిళనాడు ప్రభుత్వం, అరుణాచలేశ్వర ఆలయ యాజమాన్యం వెంటనే చర్యలకు దిగాయి. ఇకపై ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టాయి. ప్రాణనష్టాన్ని నివారించేందుకు గుహ ప్రవేశం వద్ద కొత్తగా ఇనుప బారీకేడ్లను ఏర్పాటు చేశారు. ముందుగా ఈ ఐరన్ బార్ల మధ్య నుంచి వెళ్లగలిగిన సన్నటి శరీరాకృతి ఉన్నవారిని మాత్రమే గుహ లోపలికి అనుమతిస్తున్నారు.
దీనితో పాటు శ్వాసకోశ సమస్యలు, అధిక బరువు ఉన్నవారు వెళ్లకుండా తెలుగు, తమిళం, ఇంగ్లీష్ భాషల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు.. మోక్షమార్గంలో భక్తులు ఒకేసారి ఎక్కువ సంఖ్యలో ప్రవేశించకుండా ప్రత్యేక నియంత్రణ చర్యలను కూడా అమలు చేస్తున్నారు.. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.












