భారతదేశ అపారమైన చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మిక మూలాలపై ఒక అమెరికన్ టాటూ ఆర్టిస్ట్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. రాజస్థాన్లోని జైపూర్ నగరంలో పర్యటిస్తున్న అమెరికన్ టాటూ ఆర్టిస్ట్ జెమా ఫెర్రర్(JemmaFerrer) భారతీయ సంప్రదాయాలను దగ్గరగా పరిశీలించి, పాశ్చాత్య ప్రపంచం భారత్ను చూసే సంకుచిత దృక్పథాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ‘భారత్ గురించి ఇంతవరకు నేను అనుకున్నదంతా తప్పు.. ఈ దేశ గొప్పతనం, ప్రాచీన సంస్కృతి ఇప్పుడు నాకు స్పష్టంగా అర్థమవుతోంది’ అని ఆమె వ్యాఖ్యానించారు.
విదేశీ సినిమాలు, పాప్ కల్చర్లో భారత్ను కేవలం పేదరికం, జనాభా రద్దీ, అధ్వాన జీవన పరిస్థితులతో మాత్రమే ముడిపెట్టి చూపిస్తారని జెమా అసంతృప్తి వ్యక్తం చేశారు. అదే సమయంలో భారత్ ప్రపంచానికి అందించిన యోగా, ఆయుర్వేదం, ధ్యానం, చేనేత ఉత్పత్తులు నేడు పాశ్చాత్య దేశాల్లో బిలియన్ డాలర్ల వ్యాపారాలుగా మారాయని గుర్తుచేశారు. భారతీయ సంస్కృతి నుంచి ప్రపంచవ్యాప్తంగా వ్యాపార ప్రయోజనాలు పొందుతున్నప్పటికీ, ఈ మహత్తర జ్ఞానాన్ని సృష్టించిన భారత సమాజానికి తగిన గుర్తింపు, గౌరవం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
భారత ఆర్థిక చరిత్రను ప్రస్తావిస్తూ బ్రిటిష్ పాలనపై జెమా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘భారత్ స్వతహాగా పేద దేశం కాదు, దానిని పేద దేశంగా మార్చారంతే’ (India wasn't poor, it was made poor) అన్న సత్యాన్ని ఆమె గుర్తుచేశారు. పత్తి, మస్లిన్, పట్టు వస్త్రాల తయారీలో శతాబ్దాల చరిత్ర కలిగిన భారతీయ మార్కెట్లను బ్రిటిష్ వలస పాలనా విధానాలు దారుణంగా దెబ్బతీశాయని, ఫలితంగా స్థానిక చేనేత కళాకారులు తీవ్రంగా నష్టపోయారని వివరించారు. మహాత్మా గాంధీ నాయకత్వంలో అహింసా మార్గంలో సాగిన భారత స్వాతంత్ర్య ఉద్యమం ప్రపంచ చరిత్రలోనే అత్యంత ప్రత్యేకమైనదని కొనియాడారు.
తన ఈ భారత పర్యటన ఆలోచనా విధానాన్నే పూర్తిగా మార్చేసిందని, ఇకపై తన కళ ద్వారా భారతీయ గొప్పదనాన్ని, ప్రాచీన చరిత్రను ప్రపంచానికి చాటిచెబుతానని జెమా స్పష్టం చేశారు. ఒక విదేశీ కళాకారిణి భారతీయ సంస్కృతి, ఆర్థిక మూలాలపై చూపిన ఈ అవగాహన మరియు విశ్లేషణ పట్ల నెటిజన్లు తీవ్రంగా ఆకర్షితులవుతున్నారు. సోషల్ మీడియాలో ఆమె వీడియోలకు భారతీయుల నుంచి భారీగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.












