Tollywood: సినిమా రంగంలో ఇప్పుడు వ్యాపార ధృక్పథం మొత్తం మారిపోయింది. ఒకప్పుడు సినిమా రిలీజైయ్యాక గానీ శాటిలైట్ బిజినెస్ జరిగేది కాదు. కానీ, రాను రానూ ముందుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ అని థియేట్రికల్..శాటిలైట్..ఓటీటీ పార్ట్నర్స్ ని ముందే ఫిక్స్ చేసుకుంటున్నారు. సినిమా రిలీజ్ కి చాలా నెలల ముందుగానే ఒప్పందాలు పూర్తవుతున్నాయి.
అయితే, ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ సంస్థలే తీవ్ర నష్టాలలో ఉన్నట్టుగా ఇండస్ట్రీలో టాక్ ఉంది. పెద్ద హీరోల సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఫలితం తేడా కొట్టడంతో..అలాంటి సినిమాలను ఓటీటీలో చూడటానికి కూడా ప్రేక్షకులు ఆసక్తి చూపించడం లేదు. దాంతో, వందల కోట్లు పెట్టుబడి పెట్టి రైట్స్ తీసుకున్న చాలా సినిమాలు నష్టాలను మిగుల్చుతున్నాయి. దీంతో, ఎంత పెద్ద స్టార్ హీరో సినిమాకైనా ఓటీటీ సంస్థలు కఠినంగా ఆంక్షలు విధిస్తున్నాయి.
మేకర్స్ చెప్పిన తేదీకి సినిమాను థియేటర్స్లో రిలీజ్ చేయాల్సిందే. లేదంటే కుదుర్చుకున్న ఒప్పందంలో మార్పులు జరగక తప్పదని ముందుగానే హెచ్చరిస్తున్నారు. పొరపాటున గనక టెక్నికల్ ఇష్యూస్ సహా ఏ ఇతర కారణాల వల్ల గానీ సినిమా ప్రకటించిన తేదీకి థియేటర్స్లోకి రాకపోతే కోతలు పడిపోతున్నాయి. దీన్ని, దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఫిల్మ్ మేకర్స్ చెప్పిన తేదీకి ఎట్టిపరిస్థితుల్లోను సినిమాను పూర్తి చేయాల్సి వస్తోంది.
ఓటీటీలకి ప్రభాస్-బాలయ్య అని లేదు!
వ్యాపారంలో ఎవరైనా ఒకటే అని ఓటీటీ సంస్థలు తేల్చి చెప్పేశాయి. అందుకే, ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ సినిమాకి నాన్ స్టాప్గా షూటింగ్ జరుపుతున్నారు. డిసెంబర్ 3న రిలీజ్ అని ప్రకటించిన మేకర్స్, ఓటీటీ ఒప్పందం ప్రకారం ఆ డేట్కి థియేటర్స్లోకి తీసుకు వస్తామని ప్రకటించారు. బాలయ్య నటిస్తున్న దాదా సినిమా పరిస్థితి కూడా ఇంతే. ఇటీవల ఆయనకి గాయం కావడంతో మేకర్స్ ఈ ఏడాది సినిమాను రిలీజ్ చేయలేరని వార్తలు వచ్చాయి. కానీ, ఓటీటీ ఒప్పందం ప్రకారం ఇదే ఏడాది డిసెంబర్ 24న ఖచ్చితంగా థియేటర్స్లో రిలీజ్ చేయ్యడానికి రెడీ అవుతున్నారు. ఈ విషయంలో ఎక్కువగా హీరోలకి, దర్శకులకి మానసిక ఒత్తిడి ఉంటోంది.












