తెలంగాణ

Telangana: చావు చుట్టూ చిల్లర రాజకీయాలు.. పోరుగడ్డపై దిగజారిన పార్టీలు!!..

రచన: Venu6 నిమిషాల పఠనం

గతంలో తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు ఉన్నప్పటికీ, ఒక పరిమితి ఉండేది. సిద్ధాంత పరమైన విభేదాలు ఎంత ఉన్నా, వ్యక్తిగత విద్వేషాలకు తావుండేది కాదు. కానీ నేటి పరిణామాలు ఆ సరిహద్దులను చెరిపేస్తున్నాయి. అధికారం కోసం, పార్టీ మైలేజ్ కోసం ఎంతటి నీచమైన ఎత్తుగడలైనా వేయడానికి వెనుకాడటం లేదనే ఆరోపణలున్నాయి..

తెలంగాణ ఒకప్పుడు సిద్ధాంతాల పోరాటాలకు.. ఉద్యమాలకు నిలయం.. అన్యాయంపై గొంతెత్తిన నేల.. హక్కుల కోసం పోరాడిన చరిత్ర ఈ గడ్డది.. కానీ.. నేటి రాజకీయ పరిస్థితులు చూస్తే ఆ పోరాట స్ఫూర్తి ఎక్కడికి వెళ్లిందన్న ప్రశ్న తలెత్తుతోంది.. ప్రజా సమస్యలు, అభివృద్ధి, విధానాలపై చర్చ జరగాల్సిన చోట.. వ్యక్తిగత విమర్శలు, పరస్పర ఆరోపణలు, దూషణలు పెరిగిపోతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

నిన్నటి వరకు రాజకీయ ప్రత్యర్థులపై మాటల దాడి.. ఇప్పుడు ఏకంగా వ్యక్తిగత జీవితాల చుట్టూ వివాదాలు!.. ఉద్యమాల నుంచి వచ్చిన తెలంగాణ రాజకీయాలు.. అధికారం కోసం ఇంత దిగజారుడు భాషకు చేరుకోవడం ఆందోళనకలిగిస్తున్న అంశం.. ఇక గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ప్రజాస్వామ్యవాదులను విస్మయానికి గురిచేస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ ఫామ్‌హౌస్ చుట్టూ చోటుచేసుకున్న సంఘటనలు ఇందుకు నిదర్శనం.

నిన్నటి వరకు పరస్పర బూతు పురాణాలు, తీవ్ర దూషణలతో హోరెత్తించిన నాయకులు.. ఇప్పుడు ఏకంగా 'చావు రాజకీయాలకు' తెరలేపడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఫామ్‌హౌస్ ముందు డప్పులు పట్టుకెళ్లడం, నిరసనల పేరిట వికృత చేష్టలకు పాల్పడటం.. రాజకీయంలో నయా ట్రెండ్‌గా మారడం దురదృష్టకరం అనే విమర్శలు పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్నాయి..

మరోవైపు కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. కేసీఆర్ మరణాన్ని కోరుకుంటున్నట్టుగా మాట్లాడటమే కాకుండా.. ఆయన ఇంటి వద్ద వెయ్యి డప్పులు కాదు.. ఇంకా ఎక్కువ డప్పులు తీసుకెళ్లి చావు డప్పు కొడతామని శంకర్ వ్యాఖ్యానించడం వివాదాస్పదంగా మారింది. రాజకీయ ప్రత్యర్థిపై విమర్శలు చేయడం ప్రజాస్వామ్యంలో సహజమే.

కానీ.. ఒక నాయకుడి మరణాన్ని కోరుకునే స్థాయిలో వ్యాఖ్యలు చేయడం మాత్రం రాజకీయ సంస్కృతికి ఏమాత్రం మంచిది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ఉద్యమ చరిత్ర ఉన్న ఈ గడ్డపై.. రాజకీయ భేదాలు ఎంత తీవ్రంగా ఉన్నా.. ప్రజాసమస్యలపై పోరాడాల్సిన నాయకులు.. ఇలా వ్యక్తిగత దూషణలకు దిగడం సరైన పద్ధతేనా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి..

ఈ రోజు ఏకంగా ఒక నాయకుని చావును కోరుకునే స్థాయిలో రాజకీయాలు చేయడం.. తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపిన ఒక సీనియర్ నాయకుడికి చివరికి ఇటువంటి పరిస్థితి కల్పించడం కాంగ్రెస్ దిగజారుడు తనానికి నిదర్శనమని విమర్శలు గుప్పుమంటున్నాయి.. గతంలో తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు ఉన్నప్పటికీ, ఒక పరిమితి ఉండేది. సిద్ధాంత పరమైన విభేదాలు ఎంత ఉన్నా, వ్యక్తిగత విద్వేషాలకు తావుండేది కాదు. కానీ నేటి పరిణామాలు ఆ సరిహద్దులను చెరిపేస్తున్నాయి. అధికారం కోసం, పార్టీ మైలేజ్ కోసం ఎంతటి నీచమైన ఎత్తుగడలైనా వేయడానికి వెనుకాడటం లేదనే ఆరోపణలున్నాయి..

ఉద్యమ నేతగా రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్‌పై జరుగుతున్న ఈ రకమైన దాడులు, ఆయన మరణాన్ని కోరుకునే రీతిలో సాగుతున్న నిరసనలు ప్రజాస్వామ్యానికే మచ్చగా మారుతున్నాయి. నిన్నటి దాకా రాజకీయ దాడికి పరిమితమైన ఈ వ్యవహారం.. ఇప్పుడు అసహ్యకరమైన విధానంలోకి మారడం.. రాజకీయ విలువలకు తిలోదకాలిస్తున్న నేతల తీరుకు నిదర్శనం అని నిరూపిస్తుంది.

ఇక రాజకీయాల్లో గెలుపోటములు సహజం.. కానీ, ఇలాంటి శవ రాజకీయాలు, వికృత నిరసనలు సంస్కృతికి ఏమాత్రం తగవనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.. కక్ష సాధింపులు, చావు కోరుకునే దుర్మార్గమైన ధోరణులకు ముగింపు పలకకపోతే.. రాబోయే రోజుల్లో ప్రజలే మతి తప్పి ప్రవర్తిస్తున్న పార్టీకి తగిన రీతిలో బుద్ధి చెప్పడం ఖాయమని ప్రజలు అంటున్నారు..

#Telangana#politics#brs#congress#kcr#mla veerapalli shankar#death politics
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి