అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మీద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై దళిత సంఘాలు భగ్గుమన్నాయి. దళితులంటే బీఆర్ఎస్ పార్టీ నేతలకు ఏమాత్రం గౌరవం లేదని, తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడితే ఊరుకునేది లేదని స్పష్టంచేశాయి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గులాబీ నేతలకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించాయి. దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వ్యవహరిస్తే ఎంతటి వారినైనా ఎదురిస్తామని హెచ్చరించాయి. దళితుల హక్కుల పరిరక్షణ కోసం ఎంత దూరమైనా పోరాడతామని వెల్లడించాయి.
ఈ క్రమంలోనే అసెంబ్లీ స్పీకర్ మీద బీఆర్ఎస్ పార్టీ వైఖరిని, మాజీ సీఎం కేసీఆర్ తీరును నిరసిస్తూ దళిత సంఘాలు, కాంగ్రెస్ నాయకులు తుర్కపల్లి మండల కేంద్రంలో చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో అధికార పార్టీ ప్రభుత్వ విప్లు బీర్ల అయిలయ్య, వేముల వీరేశం, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డిలు పాల్గొన్నారు. వారి నిరసనలకు మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్లు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అన్నివేళలా దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ వస్తోందని, మాజీ సీఎం కేసీఆర్ పాలనలో, బీఆర్ఎస్ నేతల వైఖరిలో దళితులను అణగదొక్కే ధోరణి కనిపించిందని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య విమర్శించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 కారణంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తుచేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో దళితుల పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు.
హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ పరిసరాల్లో కేసీఆర్ హయాంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసినప్పటికీ.. ఆచరణలో మాత్రం దళితులను 125 అడుగుల లోతుకు తొక్కే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఒక దళిత బిడ్డను, ఆయన తల్లిని ఉద్దేశించి బీఆర్ఎస్ నేతలు నిన్న మాట్లాడిన తీరు అత్యంత బాధాకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలు యావత్ దళిత జాతి మనోభావాలను తీవ్రంగా గాయపరిచాయని పేర్కొన్నారు.ఫాంహౌస్కే పరిమితమైన మాజీ సీఎం కేసీఆర్, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆగడాలు ఏ మాత్రం తగ్గలేదన్నారు.అందుకే రాష్ట్రవ్యాప్తంగా దళితులు రోడ్లపైకి వచ్చి కేసీఆర్కు డప్పు కొట్టి నిరసన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.











