Assembly Debate: ప్రజాస్వామ్యంలో చట్టసభలకు అత్యంత కీలక స్థానం ఉంది. ప్రజల జీవితాలను ప్రభావితం చేసే నిర్ణయాలు, విధానాలు, చట్టాలపై విస్తృతంగా చర్చించి పరిష్కార మార్గాలను అన్వేషించాల్సిన వేదికలుగా అసెంబ్లీలు, శాసన మండళ్లు పని చేయాలి. అయితే ప్రస్తుతం దేశంలోని అనేక రాష్ట్రాల చట్టసభల్లో ఇందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయనే విమర్శలు రాజకీయ విశ్లేషకుల నుంచి సాధారణ పౌరుల వరకు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయిన నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో చోటు చేసుకున్న పరిణామాల కారణంగా చట్టసభల నిర్వహణ.. ప్రతిపక్ష, అధికార పక్ష సభ్యుల వ్యవహార శైలిపై ప్రజల్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజా సమస్యల కంటే రాజకీయ ఆధిపత్యమే పార్టీల ప్రధాన లక్ష్యంగా మారుతోందనే అభిప్రాయాలు సామాన్య జనం నుంచి వస్తున్నాయి.
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే ముందు అధికార, ప్రతిపక్ష పార్టీలు కీలక అంశాలపై చర్చిస్తామని ప్రకటిస్తాయి. కానీ సభ మొదలైన తర్వాత నిరసనలు, నినాదాలు, పరస్పర ఆరోపణలు, వాగ్వాదాలతో అసలైన కార్యకలాపాలు నిలిచిపోతున్న సందర్భాలు తరచూ కనిపిస్తున్నాయి. ఒక అంశంపై ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని విపక్షం పట్టుబడితే.. నిబంధనలను పాటించాలని అధికార పక్షం సూచించడం, చివరకు సభ వాయిదా పడటం ఈ రోజుల్లో సాధారణంగా మారిపోయింది.
ఇలాంటి పరిణామాలతో విలువైన సభా సమయం మాత్రమే కాకుండా ప్రజాధనం కూడా వృథా అవుతోందనే వాదన వినిపిస్తోంది. ఎమ్మెల్యేల జీతభత్యాలు, కార్యాలయ నిర్వహణ, సిబ్బంది, ప్రయాణాలు, సమావేశాల నిర్వహణ వంటి వాటికి ప్రభుత్వాలు భారీగా ఖర్చు చేస్తున్నాయి. అయినప్పటికీ ప్రజలకు సంబంధించిన కీలక అంశాలపై ఆశించిన స్థాయిలో చర్చ జరగకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
నిజానికి ప్రజాస్వామ్యంలో అధికార, ప్రతిపక్షాల మధ్య భిన్నాభిప్రాయాలు సహజమే. అయితే వాదనలను పరస్పరం వినిపించుకుని, ఆధారాలతో చర్చించి, ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడమే చట్టసభల అసలు ఉద్దేశం అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అధికార పక్షం సంఖ్యా బలాన్ని ఉపయోగించి విపక్షాన్ని అణచివేయకూడదని, ప్రతిపక్షాలు కూడా ప్రతి అంశాన్ని రాజకీయ పోరాటంగా మార్చకుండా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలనే సూచనలు వెల్లువెత్తున్నాయి. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు తమ పదవికి ఉన్న బాధ్యతను గుర్తించి వ్యవహరించినప్పుడే శాసన వ్యవస్థపై ప్రజల్లో మరింత విశ్వాసం పెరుగుతుందని చెబుతున్నారు.
లేకపోతే సభలో జరిగే ప్రతి రచ్చకు చివరికి నష్టపోయేది రాజకీయ పార్టీలు మాత్రమే కాదని.. ప్రజలే అని పేర్కొంటున్నారు. ప్రజల డబ్బుతో నడిచే చట్టసభల్లో ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చ జరగడం, నిర్ణయాలు తీసుకోవడం, ప్రభుత్వాన్ని జవాబుదారీగా నిలబెట్టడం తప్పనిసరి అని మేధావులు అభిప్రాయపడుతున్నారు. లేదంటే ప్రజాస్వామ్య వ్యవస్థపై సామాన్యుల్లో మరింత నిరాశ ఏర్పడే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు.










