శాసనసభలో జరిగిన అనూహ్య ఘటనలపై ప్రతిపక్ష నేతలు కనీసం క్షమాపణలు చెబుతారని భావించానని, కానీ విషయాలను పక్కదోవ పట్టించేలా వ్యవహరించడం వల్లే తనకు కోపం రావాల్సి వచ్చిందని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిణామాలు, సభా సంప్రదాయాలపై పాత్రికేయులతో నిర్వహించిన అనధికారిక 'చిట్ చాట్' లో ఆయన పలు కీలక అంశాలను వెల్లడించారు.
గతంలో సబితా ఇంద్రారెడ్డికి, తనకు మధ్య రాజకీయ యుద్ధం నడిచినా ఎప్పుడూ హద్దులు దాటలేదని స్పీకర్ గుర్తుచేశారు. హరీశ్రావు పదేళ్లపాటు సభలో మంత్రిగా పనిచేసి కూడా కనీసం బాధ్యతాయుతంగా స్పందించకపోవడం సరికాదని విమర్శించారు. ఘటన అసెంబ్లీ పరిధిలోకి రాదనడం తగదని, పబ్లిక్ గార్డెన్స్ నుంచే అసెంబ్లీ పరిధి ప్రారంభమవుతుందని తేల్చి చెప్పారు.
సస్పెండ్ చేసే అధికారం ఉన్నా ఊరుకున్నాం
శాసనసభ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులను కేటీఆర్, కౌశిక్ రెడ్డి కొడుతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయని స్పీకర్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో పాటు ఇద్దరు ఎమ్మెల్సీలను తక్షణమే సస్పెండ్ చేసి పంపే అధికారం తనకు ఉన్నప్పటికీ, ఆ రకమైన చర్యలు కాంగ్రెస్ విధానం కాదనే భావనతో ఊరుకున్నానని తెలిపారు. మహిళా ఎమ్మెల్యేల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సీరియస్గా ఉన్నారని, నివేదిక తెప్పించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
కేసీఆర్కు ఫోన్ చేసి సభకు రమ్మని పిలిచా
సభలో ప్లకార్డుల ప్రదర్శనపై కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రూపొందించిన నిబంధనలనే తాము అమలు చేస్తున్నామని స్పీకర్ తెలిపారు. గతంలో పార్లమెంట్లో రాహుల్ గాంధీ ప్లకార్డు పట్టుకెళ్లినప్పుడు స్పీకర్ అభ్యంతరం చెప్పగానే ఆయన వెంటనే దాన్ని ఇచ్చేశారని గుర్తుచేశారు. ‘సభను సమర్థవంతంగా నడిపేందుకు ప్రతీసారి సభకు ముందే ఎల్పీ నేతలకు ఫోన్ చేస్తున్నా. ఇందులో భాగంగానే కేసీఆర్కు ఫోన్ చేసి మాట్లాడాను. సభకు రండి.. అని పిలిచాను. దానికి ఆయన ఆరోగ్యం సహకరించడంలేదని చెప్పారు’ అని స్పీకర్ వెల్లడించారు. తాజా పరిణామాల నేపథ్యంలో నేటి సభ కార్యకలాపాలకు తాను దూరంగా ఉంటున్నట్లు స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రకటించారు. నేటి సభా నిర్వహణ కోసం ప్యానెల్ స్పీకర్గా కడియం శ్రీహరిని నియమిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.








