ఢిల్లీలో ఓ వైపు పార్లమెంటు సమావేశాలు కొనసాగుతుండగానే మరోవైపు జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసనలు ఊపందుకున్నాయి. ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సోనమ్ వాంగుచుక్ ఆస్పత్రి నుంచే తన దీక్షను కొనసాగిస్తున్నారు. నిన్న ఆయన్ను కేంద్రమంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ వచ్చి పరామర్శించి దీక్ష విరమించాల్సిందిగా కోరారు.అయితే, తమ ప్రధాన మూడు డిమాండ్లు పరిష్కరిస్తే దీక్ష విరమణకు సిద్ధంగా ఉన్నట్టు వాంగ్ చుక్ పేర్కొన్నారు. మరోవైపు సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే సైతం దీక్ష విరమించాలని ఓ వీడియో రిలీజ్ చేశారు.
ఇదిలాఉండగా, నీట్ పేపర్ లీకేజీ విషయంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, పార్లమెంటులో నీట్ పై చర్చ, విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని సీజేపీ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నది. డిమాండ్ల సాధన కోసం విద్యార్థులతో కలిసి నిరసన తెలుపుతోంది.అయితే, తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థులు చేస్తున్న నిరసనకు సంఘీభావం తెలిపారు. దీనికితోడు బీఆర్ఎస్వీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది.
శుక్రవారం ఉదయం 10 గంటలకు ఇందిరా పార్కులో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందులో పాల్గొనాలని కేటీఆర్ నిర్ణయించారు.ఢిల్లీలో విద్యార్థులు చేస్తున్న ఆందోళనలకు దేశంలోని ఇతర పార్టీలు సైతం తమ మద్దుతు ప్రకటిస్తున్నాయి. శివసేన పార్టీ నేరుగా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్దకు వెళ్లి తమ మద్దతు ప్రకటించింది.ఎన్సీపీ సైతం విద్యార్థుల తరపున ప్రధాని మోడీకి ఓ నివేదిక పంపింది. పలువురు ప్రముఖులు, ఇతర పార్టీలు సైతం క్రమంగా మద్దతు తెలుపుతున్నాయి.












