పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణలు క్లైమాక్స్కు చేరుకున్నాయి. ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం, పరస్పర హెచ్చరికలతో ఆసియా ఖండంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్కు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. వ్యూహాత్మక హర్మూజ్ జలసంధిలో ప్రయాణించే వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడి చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.
ఇరాన్ చేసే ప్రతి దాడికీ ప్రతీకారంగా... ఆ దేశంలోని కీలక వంతెనలు, విద్యుత్ కేంద్రాలు, అంతెందుకు న్యూక్లియర్ ప్లాంట్లపై బాంబుల వర్షం కురిపిస్తామని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ ఇచ్చిన ఈ వార్నింగ్పై ఇరాన్ ఇస్లామిక్ రెవెల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) తీవ్రంగా స్పందించింది. ఇరాన్ ప్రభుత్వ అనుబంధ న్యూస్ ఏజెన్సీ తస్నిమ్ కథనం ప్రకారం.. అమెరికాను హెచ్చరిస్తూ IRGC సంచలన ప్రకటన విడుదల చేసింది.
యుద్ధం అంటూ కొనసాగితే అమెరికా జాతీయ సంతాప దినాలు చేసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది. 2001లో సెప్టెంబర్ 11న అల్-ఖైదా ఉగ్రవాదులు అమెరికాపై జరిపిన 9/11 తరహా దాడులను ఇరాన్ గుర్తు చేసింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్పై జరిగిన ఆ దాడిలో మూడు వేల మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అమెరికాపై 9/11 తరహా దాడులు చేస్తామని హెచ్చరించింది.
మరోవైపు ట్రంప్ కూడా ఘాటుగా స్పందించాడు.. ఇప్పటికే ఇరాన్ను పాతిక సంవత్సరాలు వెనక్కి నెట్టామని, ఆ దేశాన్ని అంతం చేసేవరకు వదిలేది లేదని స్పష్టం చేస్తుండగా.. ట్రంప్ బెదిరింపులకు వెనక్కి తగ్గేదే లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. ఊహించని విధంగా మారుతున్న ఈ పరిస్థితుల్లో సూపర్ పవర్స్ మధ్య సాగుతున్న ఈ యుద్ధ వాతావరణం ఎటు దారితీస్తుందోనని ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి..












