దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోన్న(NEET) పరీక్షల్లో అక్రమాలు, విద్యావ్యవస్థలో సంస్కరణాలకై పోరాడుతున్న విద్యార్థులకు ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తన సంపూర్ణ మద్దతును పలికారు. ప్రజాస్వామ్యంలో హక్కుల కోసం ప్రశ్నించడం, నిరసనలు చేపట్టడం చాలా ఆరోగ్యకరమైన పరిణామమని 71 ఏళ్ల అనుపమ్ ఖేర్ వ్యాఖ్యానించారు. అయితే విద్యార్థులు చేపట్టిన ఈ న్యాయమైన ఉద్యమాన్ని ఇతరులు తమ స్వార్థ రాజకీయాల కోసం వాడుకోకుండా అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలు రాజకీయ ఒత్తిళ్లకు లోనయ్యే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి వారు విద్యార్థుల ఆందోళనలను తమ సొంత రాజకీయ ఎజెండాను నెరవేర్చుకోవడానికి ఉపయోగించుకుంటారని విశ్లేషించారు. గతంలో తాను కూడా విద్యార్థినేనని గుర్తు చేసుకుంటూ.. ప్రస్తుత యువత పడుతున్న ఆవేదనను, వారి భవిష్యత్తుపై ఉన్న కలలను తాను సంపూర్ణంగా అర్థం చేసుకోగలనని చెప్పారు.
"విద్యార్థులు జరిపే పోరాటం ఏ స్వార్థం లేనిది, అత్యంత స్వచ్ఛమైనది. మెరుగైన దేశ నిర్మాణం కోసం, తమ హక్కుల పరిరక్షణ కోసమే వారు రోడ్లపైకి వస్తారు. "పోరాటం తీవ్రరూపం దాలుస్తున్న కొద్దీ, ప్రతి నిరసన ప్రదేశంలో ప్రత్యక్షమయ్యే రాజకీయ అవకాశవాదులు ఈ ఉద్యమంలోకి కూడా ప్రవేశించే ప్రమాదం ఉందని అనుపమ్ ఖేర్ హెచ్చరించారు.
అయితే ఉద్యమంలో మంది ఎక్కువైనంత మాత్రాన దానికి బలం చేకూరదని, కొన్నిసార్లు ఆ గందరగోళం వల్ల అసలు లక్ష్మం పక్కదారి పట్టి విద్యార్థులకే తీవ్ర నష్టం వాటిల్లుతుందని స్పష్టం చేశారు. విద్యార్థుల్లో ఉండే ఆవేశం, వారిలోని నిజాయితీ మాత్రమే వారి అతిపెద్ద శక్తి అని అనుపమ్ ఖేర్ ఉద్ఘాటించారు. రాజకీయ నాయకుల చేతుల్లో లేదా ఇతరుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారి ఆయుధాలుగా మారకూడదని, తమ ఐక్యతను కాపాడుకుంటూ లక్ష్యాన్ని సాధించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.












