రాష్ట్రంలో మరో దారుణం చోటుచేసుకుంది. రాష్ట్రం మొత్తం లా అండ్ ఆర్డర్, పోలీసు, నిఘా విభాగాలను శాసించే డీజీపీ ఆఫీసులో తుపాకీ పేలింది. సర్వీసు తుపాకీతో కాల్చుకుని కానిస్టేబుల్ స్వామి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ముందుగా బయట నుంచి ఎవరో వచ్చి కాల్పులు జరిపినట్టు అంతా భావించినట్టు సమాచారం. కానీ, బాత్రూంలో కానిస్టేబుల్ కాల్చుకుని పడి ఉండటాన్ని చూసి ఒక్కసారిగా డీజీపీ ఆఫీసు సిబ్బంది ఒక్కసారిగా షాక్ అయినట్టు తెలిసింది.
ఉదయం సరిగ్గా 5.30కి వాష్రూమ్ వెళ్లిన స్వామి అక్కడే పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్తో షూట్ చేసుకున్నట్టు సమాచారం. దీంతో స్పాట్ లోనే మరణించినట్టు తెలిసింది. కానిస్టేబుల్ మృతదేహం వద్ద పోలీసులకు ఓ సూసైడ్ నోట్ కూడా లభించినట్టు తెలుస్తోంది. అందులో మృతుడు స్వామి ఆత్మహత్య విషయానికి గల కారణాలు వెల్లడించినట్టు సమాచారం. అంతేకాకుండా తన భార్య, పిల్లలను ఏమీ అనవద్దని రాసి ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు.
కానీ, స్వామి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? ఉన్నతాధికారుల వేధింపులు వల్లే ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందా? లేదా అనారోగ్య సమస్యల కారణంగానా? ఏ విషయం తెలియరాలేదు.దర్యాప్తు అనంతరం పోలీసులు అసలు విషయాన్ని వెల్లడిస్తారని తెలుస్తోంది.












