ఇప్పటి వరకు వాణిజ్య రవాణాకు కీలకమైన జలమార్గంగా ఉన్న కాస్పియన్ సముద్రం.. ఇప్పుడు అంతర్జాతీయ ఉద్రిక్తతలకు వేదికగా మారుతోంది. ఇరాన్కు చెందిన ఓ వాణిజ్య నౌకపై ఉక్రెయిన్ దాడి చేసిందని టెహ్రాన్ ఆరోపించింది. ఈ ఘటనలో ఒక నావికుడు మరణించగా.. మరో వ్యక్తి గాయపడినట్లు ఇరాన్ ప్రకటించింది.
ఈ దాడిపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ దేశానికి చెందిన ప్రజలు, ఆస్తులు, జాతీయ ప్రయోజనాలపై దాడులను సహించబోమని స్పష్టం చేసింది. దాడికి బాధ్యులైన వారు తగిన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. అంతేకాదు.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరింత విస్తరించకుండా యూరప్ దేశాలు కీవ్పై ఒత్తిడి తీసుకురావాలని టెహ్రాన్ కోరింది.
అయితే.. ఉక్రెయిన్ మాత్రం ఇరాన్-రష్యా సంబంధాలపై తీవ్ర ఆరోపణలు చేస్తోంది. రష్యా నుంచి ఇరాన్కు ఉపగ్రహ సమాచారం అందుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ ఆరోపించారు. గల్ఫ్ ప్రాంతంలోని కీలక ప్రాంతాలు, అమెరికా సైనిక స్థావరాలకు సంబంధించిన సమాచారాన్ని రష్యా సేకరించి ఇరాన్కు అందిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ తన సైనిక చర్యల్లో ఈ సమాచారాన్ని ఉపయోగిస్తోందన్నది కీవ్ వాదన.
మరోవైపు ఇరాన్కు కాస్పియన్ సముద్ర మార్గం ఎంతో కీలకం. అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఉత్తర దిశ నుంచి చైనా సహా ఇతర దేశాలతో వాణిజ్య సంబంధాలు కొనసాగించేందుకు ఈ మార్గం కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే ఇరాన్ వాణిజ్య నౌకపై జరిగినట్లు చెబుతున్న ఈ దాడి అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదే సమయంలో.. ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా భారీ దాడులు జరిపింది. బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో రష్యా దాడులకు దిగినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. కీవ్తో పాటు మరికొన్ని నగరాలు కూడా దాడులకు గురయ్యాయి. ఈ ఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు గాయపడ్డారు.
ఒకవైపు ఇరాన్-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తత.. మరోవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతుండటం.. పశ్చిమాసియాలో ఇప్పటికే నెలకొన్న ఉద్రిక్తతలకు తోడు ఈ తాజా సంఘటనలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి












