కాక్రోచ్ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం తీరుపై మరోసారి తీవ్రఆరోపణలు చేసింది.నిరసనకారులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో ఘోరంగా విఫలమైందని సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.కేంద్రమంత్రులతో చర్చల సమయంలో భాగంగా నిరసనకారులపై నమోదైన కేసులన్నింటినీ ఎత్తివేస్తామని హామీ ఇచ్చారని.. ఆ మాటను ఇంకా నెరవేర్చలేదని అన్నారు.
అందుకే కేంద్రం తీరును ఆయన తప్పుబట్టారు. సోమవారం సౌరవ్ మీడియాతో మాట్లాడుతూ.. వివిధ రాష్ట్రాల్లో నిరసన తెలిపిన విద్యార్థులపై కొత్తగా కేసులు పెడుతున్నారని, వారిని వేధిస్తున్నారని, తమకు పెద్దఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా అసోం, పశ్చిమ బెంగాల్, బిహార్ రాష్ట్రాల్లో నిరసనకారులను లక్ష్యంగా చేసుకుని భారీగా కేసులు నమోదు చేస్తున్నట్టు పలువురు విద్యార్థులు తమ దృష్టికి తీసుకొచ్చారని గుర్తుచేశారు.
బాధితులకు న్యాయం అందించేలా.. ఈ కేసులకు సంబంధించి సీజేపీ లాయర్లు చట్టపరంగా సంప్రదింపులు జరుపుతున్నారని సౌరవ్ దాస్ మీడియాకు వివరించారు. ఇటీవల కేంద్రం ఇచ్చిన మాటను గుర్తుచేస్తూ తక్షణమే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. ‘రేపటిలోగా దేశవ్యాప్తంగా నిరసనకారులపై పెట్టిన అన్ని కేసులనూ బేషరతుగా ఉపసంహరించుకోవాలి. లేదంటే కేంద్ర వైఖరికి నిరసనగా మరోసారి దేశవ్యాప్త పోరాటం తప్పదు’ అని సీజేపీ ప్రతినిధి సౌరవ్ కేంద్రానికి హెచ్చరికలు పంపారు. కాగా, దీనిపై కేంద్రం నుంచి క్లారిటీ రావాల్సి ఉన్నది.












