నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు చేపట్టిన నిరసన కార్యక్రమం దేశవ్యాప్త ఆందోళనలకు దారితీసిన విషయం తెలిసిందే.విద్యార్థులు, యువత, వామపక్ష వాదులు, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, ఇతర రాష్ట్రాల్లోని ఎన్డీయేతర పార్టీలన్నీ విద్యార్థుల నిరసనలకు మద్దతు తెలిపాయి.పార్టీలకతీతంగా సినీ,క్రీడా సెలబ్రిటీలు సైతం యువతకు పెద్దఎత్తున మద్దతు తెలిపారు. దీంతో కేంద్రంలోని మోడీ సర్కార్ దిగిరాక తప్పలేదు.
సీజేపీ ప్రతినిధులు ముందుపెట్టిన మూడు డిమాండ్లకు కేంద్రం ఆమోదం తెలిపింది. అందులో ఒకటైన కేంద్రమంత్రి రాజీనామా కూడా జరిగిపోయింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో విద్యార్థులు ఆందోళనలు విరమించారు. జంతర్ మంతర్ వద్ద నిరసనల సమయంలో విద్యార్థుల మీద నమోదైన కేసుల ఉపసంహరణ, చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం అందాల్సి ఉన్నది. అయితే, కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం ధర్మేంద్ర ప్రధాన్ రెండ్రోజులుగా కనిపించలేదు.
తాజాగా ఆయన పార్లమెంట్ భవనానికి చేరుకున్నారు. వర్షాకాల సెషన్స్ కోసం పార్లమెంట్కు వచ్చిన ఆయనకు బీజేపీ, ఎన్డీఏ (NDA) కూటమికి చెందిన ఎంపీలు ఘన స్వాగతం పలికారు.పరీక్షల సంస్కరణలు, నూతన చట్టంపై పార్లమెంట్లో చర్చ జరగనున్న నేపథ్యంలో ఆయన రాక ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే, ప్రధాన్ లోనికి వస్తున్న సమయంలో ఎన్డీఏ ఎంపీలు "ధర్మేంద్ర ప్రధాన్ జిందాబాద్" అంటూ నినాదాలు చేశారు. ఆయన చిరునవ్వుతో అందరికీ అభివాదం చేస్తూ పార్లమెంట్ ప్రాంగణంలోకి వెళ్లారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.












