తెలంగాణ ఉద్యమకారులపై లాఠీఛార్జ్పై టీఆర్ఎస్ అధినేత్రి కవిత ఫైర్
బొల్లారం పోలీస్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ నేత కవిత ఘాటు వ్యాఖ్యలు
ఇచ్చిన హామీలు అడిగితే కొడతారా అని ధ్వజం!
తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులు, మహిళల రక్తం చిందించారని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్ట్రార్ట్ అయిందని తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) అధినేత్రి కల్వకుంట్ల కవిత అన్నారు. ఉప్పల్ వేదికగా తెలంగాణ ఉద్యమకారులు, మహిళలపై జరిగిన పోలీసుల లాఠీఛార్జ్ను నిరసిస్తూ బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఉద్యమకారుల త్యాగాలపై అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు అదే ఉద్యమకారుల రక్తం చిందించడం ద్వారా తన పతనానికి పునాది వేసుకుందని కవిత వ్యాఖ్యానించారు. ఈ చర్యతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవాళ్టి నుంచే రివర్స్ కౌంట్డౌన్ ప్రారంభమైందని, ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేయడం అన్యాయమని కవిత మండిపడ్డారు.
కచ్చితంగా ఉద్యమకారుల పక్షాన నిలబడి వారి హామీలు అమలు అయ్యేలా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను మాత్రమే తాము ప్రశ్నించామని, అంతకుమించి తామేమీ కొత్త డిమాండ్లు పెట్టలేదని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణ తెచ్చిన ఉద్యమకారులను రోడ్లపై వేసి రక్తం చిందేలా కొట్టడం ఏ రకమైన ప్రజాపాలన అంటూ నిలదీశారు.
ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రతీ తెలంగాణ ఉద్యమకారుడికి ఇస్తామన్న 250 గజాల స్థలాన్ని తక్షణమే కేటాయించాలని కవిత డిమాండ్ చేశారు. తాము అడుగుతోంది కేవలం వారి హక్కులను మాత్రమేనని గుర్తుచేశారు. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు, నిద్రపోనివ్వకుండా ప్రతిరోజూ వారికి గుర్తు చేస్తూనే ఉంటామని ఆమె హెచ్చరించారు.












