తమిళనాడులో గోవధను నిషేధిస్తూ అక్కడి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆ రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తమిళనాడు నయా ముఖ్యమంత్రి దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రి కళగం (TVK) ప్రభుత్వం తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
హైకోర్టు వెలువరించిన ఆదేశాలు రాష్ట్రంలో ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాలకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయని, ప్రజల మతపరమైన ఆచారాలకు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నాయని ప్రభుత్వం తన పిటిషన్లో గట్టిగా వాదించింది. గత మే 27వ తేదీన మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు, రాష్ట్రంలోని 'తమిళనాడు జంతు సంరక్షణ చట్టం-1958' నిబంధనలను కాలరాసేలా ఉందని ప్రభుత్వం పేర్కొంది.
ప్రస్తుత చట్టం ప్రకారం.. పదేళ్ల వయసు దాటిన పశువులు, వ్యవసాయ పనులకు లేదా సంతానోత్పత్తికి పనికిరావని ప్రభుత్వ పశువైద్య అధికారి ధ్రువీకరిస్తే, వాటిని వధించేందుకు స్పష్టమైన అనుమతులు ఉన్నాయి. అయితే, హైకోర్టు ఈ చట్టబద్ధమైన నిబంధనలను పరిగణనలోకి తీసుకోకుండా రాష్ట్రవ్యాప్తంగా సంపూర్ణ నిషేధాన్ని విధించిందని టీవీకే ప్రభుత్వం తన అప్పీల్లో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.












