సిద్ధిపేట జిల్లా చేర్యాల మండలం ముస్త్యాల గ్రామానికి చెందిన వెంకటస్వామి అనే 29 ఏళ్ల ఉన్మాది.. 2020లో, 'వెంకీ దగడ్' పేరుతో ఇన్స్టాగ్రామ్లో పరిచయం పెంచుకున్నాడు.
మొదట సాధారణంగా మాట్లాడిన అతడు, తర్వాత అసభ్యకర సందేశాలు పంపడం ప్రారంభించాడు. దీంతో భయపడిన బాలిక అతడి ఫోన్ బ్లాక్ చేసింది.ఈ క్రమంలో ఆ కేటుగాడు నేరుగా ఆ బాలికకు ఫోన్ చేసి ఆమె తల్లిని కిడ్నాప్ చేస్తానని బెదిరించాడు.
తన తల్లికి ప్రమాదం జరుగుతుందని బెంబేలు పడిన బాలిక ఆ ఉన్మాది చెప్పినట్టు ఇంట్లో నుంచి రూ.18 వేల రూపాయలు తీసుకుని ఘట్కేసర్కు వెళ్లింది. అక్కడి నుంచి ఆమెను కిడ్నాప్ చేసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు వెంకట స్వామి.
అయితే, అవకాశం దొరకగానే బాలిక తన ఫోన్ నుంచి తల్లికి లోకేషన్ పంపింది. వెంటనే స్పందించిన పోలీసులు ఆమెను కాపాడి నిందితుడిని అరెస్ట్ చేశారు.
ఈ కేసును విచారించిన రంగారెడ్డి జిల్లా ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ పోక్సో కోర్టు నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.19 వేల జరిమానా విధించింది. అలాగే బాధితురాలికి రూ.2 లక్షల నష్టపరిహారాన్ని మంజూరు చేసింది.












