ఏపీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను లారీ ఢీకొన్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. మృతుల్లో రెండేళ్ల చిన్నారి ఉంది. శుక్రవారం (నేడు) తెల్లవారుజామున ఈ ప్రమాదం సంభవించింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
గిద్దలూరు పట్టణం నల్లబండ బజార్కు చెందిన కొందరు ఆటో వివాహ వేడుకకు బయల్దేరారు. ఈ క్రమంలో అతివేగంగా వస్తున్న ఓ లారీ ఆటోను బలంగా ఢీకొంది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఆవుల నాగేశ్వరి(2) ఆవుల అలకనంద(19), ఆవుల నాగేష్(17), ఆవుల అంకాలు(20) అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు నల్లబండ బజార్ నివాసితులుగా గుర్తించారు. లారీ డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా నడపడం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మర్కాపురం పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.












