వాట్సాప్లో కోడ్ లాంగ్వేజ్ ద్వారా కస్టమర్లకు స్పీడ్ పోస్టు ద్వారా ఇంటి వద్దకే గంజాయి సరఫరా చేస్తున్న ముఠాగుట్టును హైదరాబాద్ హెచ్ న్యూ పోలీసులు ఛేదించారు.ముఠా నాయకుడిని పట్టుకున్నారు. బంజారాహిల్స్ టీజీఐసీసీసీ భవనంలో సీపీ సజ్జనార్ ఆ వివరాలు వెల్లడించారు. వివరాల్లోకివెళితే.. గుడిమల్కాపూర్, ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల సుశాంత్ వ్యాస్, లడ్డూలను పోలీసులు అరెస్టు చేసి రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అది ఎక్కడి నుంచి వచ్చిందని ఆరా తీయగా, స్పీడ్ పోస్ట్ ద్వారా వచ్చిందని గుర్తించారు. హెచ్-న్యూ సీఐ బాలస్వామి ఆధ్వర్యంలో మొత్తం 22 మంది పోలీసు టీమ్తో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేయగా.. సత్యం మిశ్రా అనే వ్యక్తి కీలక నిందితుడు అని తేలింది.
ఆయన జార్ఖండ్లో గంజాయి పండించే వారు,సరఫరా చేసే వారితో పరిచయాలు పెంచుకుని వారి నుంచి గంజాయిని సేకరించడం ప్రారంభించాడని, అనంతరం ఓ ఫ్రెండ్ సలహాతో గంజాయిని స్పీడ్ పోస్ట్ ద్వారా సరఫరా చేస్తున్నాడని గుర్తించారు.ఈ గంజాయిని స్పీడ్ పోస్ట్ ద్వారా దాదాపు 21 రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారని విచారణలో తేలింది.వాట్సాప్లో 'మ్యాంగో', 'ఫ్లవర్', 'స్టిక్' పేర్లను కోడ్ వర్డ్స్గా ఉపయోగిస్తూ.. వినియోగదారుల నుంచి ముందుగానే డబ్బులు తీసుకుని ఆ తర్వాత గంజాయిని స్పీడ్ పోస్ట్ ద్వారా విమానాలు, రైళ్లు, ఇతర మార్గాల ద్వారా వినియోగదారుల వద్దకు చేరవేస్తున్నట్టు గుర్తించారు.












