DGP Anurag Dhankar: త్రిపుర పోలీస్ శాఖలో కలకలం రేగింది. ఆ రాష్ట్ర డీజీపీ అనురాగ్ ధనకర్ ఆత్మహత్య చేసుకున్నారు. అగర్తాలలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఆయన మృతదేహాన్ని గుర్తించారు. గన్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. 1994 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన అనురాగ్.. 2025లో త్రిపుర డీజీపీగా బాధ్యతలు తీసుకున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ధనకర్ తన సొంత సర్వీస్ పిస్టల్తో తనను తాను కాల్చుకున్నట్లు భావిస్తున్నారు.
ధనకర్ ను వెంటనే అగర్తలాలోని గోవింద్ వల్లభ్ పంత్ (GB) ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన చనిపోయినట్లు డాక్టర్లు ధృవీకరించారు.
"మధ్యాహ్నం 12 గంటలకు ఆసుపత్రికి తీసుకొచ్చారు. అప్పటికే నాడి గానీ, రక్తపోటు గానీ, ప్రాణ లక్షణాలు గానీ ఏమీ లేవు. దాదాపు 40 నిమిషాల పాటు సీపీఆర్ (CPR) చేసి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. 12:48 గంటలకు ఆయన మరణించినట్లు ప్రకటించాము. పోస్టుమార్టం ద్వారా మరణానికి గల కారణం తెలుస్తుంది" అని ఆసుపత్రి డాక్టర్లు వెల్లడించారు. కాగా, ఈ ఘటనకు దారితీసిన కారణాలు, కచ్చితమైన పరిస్థితులు ఇంకా తెలియరాలేదు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అమితాబ్ రంజన్ తర్వాత, అనురాగ్ ధనకర్ 2025 మే నెలలో త్రిపుర పోలీస్ డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర పోలీస్ చీఫ్ కాకముందు, ఆయన త్రిపురలో డైరెక్టర్ జనరల్ (ఇంటెలిజెన్స్)గా పనిచేశారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)లో ఆయనకు విశిష్టమైన కెరీర్ ఉంది. అక్కడ అనేక ఉన్నత స్థాయి దర్యాప్తులను నిర్వహించారు. వృత్తిపరమైన విధానం, విస్తృతమైన పోలీసింగ్ అనుభవానికి పేరుగాంచారు. రాష్ట్రంలోని అత్యంత సీనియర్ ఐపీఎస్ అధికారులలో ఒకరిగా గుర్తింపు పొందారు. ధనకర్ ఆకస్మిక మరణం పోలీసు వర్గాలను, ప్రభుత్వ అధికారులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.












