Uday Krishna Reddy: లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో చిక్కుకున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్ పై బుధవారం విచారణ జరగనుంది.
హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (SVPNPA)లో శిక్షణ పొందుతున్న ఉదయ్ కృష్ణారెడ్డిపై తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఉదయ్ పై అత్తాపూర్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. ఉదయ్ కృష్ణారెడ్డి తనను లైంగికంగా వేధించాడని, అసభ్యకరమైన మెసేజ్లు పంపుతున్నాడని, ప్రైవేట్ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఫోన్ బలవంతంగా లాక్కుని వ్యక్తిగత మేసేజ్ లు చూడటం, ప్రైవేట్ వీడియోలు తీసి వాటిని తన భర్తకు పంపి బెదిరించడం వంటివి చేశాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మహిళా ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీసులు ఉదయ్ పై కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.
తనపై వచ్చిన ఆరోపణలపై ఉదయ్ కృష్ణారెడ్డి స్పందించారు. ఆ ఆరోపణలను ఆయన ఖండించారు. అవన్నీ నిరాధారమైనవని, తామిద్దరం పరస్పర అంగీకారంతో రిలేషన్ షిప్ లో ఉన్నామని వెల్లడించారు. ఆమెకు పెళ్లయ్యాక కూడా బంధం కొనసాగిందని, దానికి సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని తెలిపారు. తాజాగా ఆయన న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరారు.
ప్రకాశం జిల్లాకు చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి కానిస్టేబుల్గా పని చేసి పట్టుదలతో ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యారు. అందరికీ ఎంతో ఆదర్శంగా నిలిచారు. అలాంటి వ్యక్తి ఇప్పుడిలా వివాదంలో చిక్కుకోవడం అందరినీ షాక్ కి గురి చేసింది.












