తెలంగాణలో ట్రాఫిక్ పోలీసుల విధి నిర్వహణలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. డ్యూటీలో ఉన్న సమయంలో ట్రాఫిక్ సిబ్బంది వ్యక్తిగత మొబైల్ ఫోన్లను ఉపయోగించకుండా.. అవసరమైతే వాటిని తమ వద్ద ఉంచుకోకుండా ఉండేలా కొత్త నిబంధన తీసుకురావాలని ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
విధుల్లో ఉన్న సమయంలో కొంతమంది సిబ్బంది మొబైల్ ఫోన్లను చూస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఘటనలు అధికారుల దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో రోడ్లపై ట్రాఫిక్ పరిస్థితులను పర్యవేక్షించడంలో అంతరాయం కలగడంతో పాటు.. ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణమే స్పందించే సామర్థ్యం తగ్గిపోతుందని అధికారులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో డ్యూటీ సమయంలో ట్రాఫిక్ సిబ్బంది పూర్తిగా విధులపైనే దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు యోచిస్తున్నట్లు సమాచారం. సిబ్బంది అప్రమత్తంగా ఉంటే ట్రాఫిక్ నియంత్రణ మరింత సమర్థంగా సాగడంతో పాటు.. రోడ్డు ప్రమాదాల సమయంలో వేగంగా స్పందించే అవకాశం ఉంటుందని అధికారులు ఆ వైపు అడుగులు వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో అధికారులు కేవలం వీహెచ్ (VHF) సెట్ల ద్వారానే కమ్యూనికేషన్ నిర్వహించే విధానాన్ని అమలు చేయాలని ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇప్పటికే టెక్నాలజీ బృందాలు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో వీహెచ్ సెట్ల సిగ్నల్ సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నాయి. ఒకవేళ ఈ విధానం అమల్లోకి వస్తే వీహెచ్ సెట్ ప్రతి ట్రాఫిక్ సిబ్బందికి తప్పనిసరిగా అందించే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఈ నిర్ణయానికి సంబంధించిన సాధ్యాసాధ్యాలపై ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహిస్తున్నారు. తుది ఆమోదం లభించిన తర్వాత కొత్త నిబంధనలను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.. అయితే ప్రస్తుతం చాలా చోట్ల ట్రాఫిక్ విధులను వదిలేసి మొబైల్ ల్లో కాలక్షేపం చేసే ట్రాఫిక్ పోలీసులు కనిపిస్తారు. మరి ఇలాంటి వారికి మొబైల్ లేకుండా కేవలం వీహెచ్ సెట్ల ద్వారా విధులు నిర్వహించడం అలవాటు అయ్యేవరకు కష్టమే అని చెప్పవచ్చు..












