AP Corona Cases: ఏపీలో మరోసారి కరోనా కలకలం చెలరేగింది. కరోనా వ్యాప్తి ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. పలు కేసులు నమోదవడం, వారిలో నలుగురు చనిపోవడం భయాందోళనకు తావిచ్చింది. కరోనా వ్యాప్తితో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కరోనా కట్టడికి చర్యలు చేపట్టింది. మరోవైపు రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసులకు కారణం అవుతున్న వేరియంట్ ను అధికారులు గుర్తించారు. జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల్లో ''ఒమిక్రాన్ RF.5'' వేరియంట్ ను గుర్తించారు. ఇది కొవిడ్ వైరస్ లోని ఒమిక్రాన్ వేరియంట్ కు చెందిన ఒక సబ్ వేరియంట్. ఇతర ఒమిక్రాన్ వేరియంట్లతో పోలిస్తే ఇది ప్రమాదకరం అని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని అధికారులు వెల్లడించారు. అందువల్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
ఒమిక్రాన్ RF.5 వేరియంట్ లక్షణాలు..
కొత్త వేరియంట్ సోకిన వారిలో వచ్చే లక్షణాల గురించి అధికారులు వెల్లడించారు.
* గొంతు నొప్పి
* దగ్గు
* జ్వరం
* తలనొప్పి
* ముక్కు కారడం ముక్కు మూసుకుపోవడం
* అలసట
* ఒళ్లు నొప్పులు (బాడీ పెయిన్స్)
కాగా, ఇవన్నీ సాధారణ లక్షణాలేనని, పైగా ప్రమాదకర వేరియంట్ కాదని.. అందువల్ల ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెప్పారు.
కాగా, రాష్ట్రంలో జూన్ 26 నుంచి జూలై 12 వరకు చూసుకుంటే మొత్తం 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కడపలో 8 కేసులు, గుంటూరులో 2 కేసులు వచ్చాయి. ఇక విశాఖ, కాకినాడ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైంది. కరోనా బారిన పడ్డ వారిలో నలుగురు చనిపోయారు. అయితే వారంతా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు అధికారులు తెలిపారు.












