YS Jagan: గుంటూరులో మహిళను వివస్త్రను చేసి టీడీపీ నేత దాడికి పాల్పడిన ఘటనపై వైసీపీ అధినేత జగన్ తీవ్రంగా స్పందించారు. ఇది మానవత్వానికే మచ్చ అని జగన్ అన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ కు ఇది నిలువెత్తు నిదర్శనమని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని విమర్శించారు.
ఈ ఘటన బుధవారమే జరిగినా 3 రోజులపాటు కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని జగన్ ఆరోపించారు. చివరకు ఆ వీడియోలు సోషల్ మీడియాలో వచ్చి రాష్ట్ర ప్రజలంతా ఛీకొట్టడంతో ప్రభుత్వం స్పందించిందని ధ్వజమెత్తారు. ఇప్పుడు తానేదో గొప్పగా చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు హడావుడి చేయడం మరింత సిగ్గుచేటు అని విమర్శించారు. ఆ వీడియోలను కప్పిపుచ్చడంపై చూపిన శ్రద్ధను నిందితులను పట్టుకోవడంపై చూపలేదని జగన్ సీరియస్ అయ్యారు.
''బుధవారం తనపై తొలిసారి దాడి జరిగిన వెంటనే బాధితురాలు పోలీసులను ఆశ్రయించినప్పుడు వారు స్పందించి ఉంటే, ఆ తర్వాత ఇంతటి ఘోరం జరిగేది కాదు కదా? ఆమె ఫిర్యాదుపై వెంటనే కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకుని ఉంటే ఈ దారుణం జరిగేదా? ఫిర్యాదు చేసిన మహిళకు రక్షణ కల్పించకుండా మౌనం వహించడం ఎంతవరకు న్యాయం? రెడ్ బుక్ పాలనలో పోలీసులు రక్షిస్తారనే ధీమాతో టీడీపీ నేతలు దుశ్శాసనుల్లా మారారు'' అని ఎక్స్ వేదికగా కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు జగన్.












