హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న కేబీఆర్ నేషనల్ పార్క్లో శనివారం ఉదయం సందర్శకులు ఊహించని దృశ్యం కనిపించింది. సాధారణంగా వాకింగ్, జాగింగ్తో సందడిగా ఉండే పార్క్లో ఒక్కసారిగా సుమారు 20 అడుగుల పొడవైన భారీ కొండచిలువ కనిపించడంతో అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు.
ఉదయం వాకింగ్కు వచ్చిన సందర్శకుల కళ్లముందే ఆ కొండచిలువ నెమ్మదిగా నడక మార్గాన్ని దాటింది. దాని భారీ పరిమాణం కారణంగా ట్రాక్ను పూర్తిగా దాటేందుకు కొంత సమయం పట్టింది. దీంతో కొద్దిసేపు అక్కడ ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. పలువురు సందర్శకులు తమ మొబైల్ ఫోన్లలో ఈ అరుదైన దృశ్యాన్ని చిత్రీకరించగా, ఆ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరోవైపు ఇలాంటి పరిస్థితుల్లో భయపడాల్సిన అవసరం లేదని ప్రకృతి నిపుణులు చెబుతున్నారు. కేబీఆర్ పార్క్ అనేది నగరంలో ఉన్నప్పటికీ, అనేక రకాల పక్షులు, జంతువులు, సరీసృపాలకు సహజ ఆవాసంగా ఉంది. అడవుల్లో నివసించే వన్యప్రాణులు అప్పుడప్పుడు ఆహారం బయటికి వచ్చినప్పుడు ఇలాంటి ప్రాంతాల్లో కనిపించడం సహజమేనని వారు పేర్కొంటున్నారు.
ఈ ఘటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. కొండచిలువ కూడా కొంతసేపటి తర్వాత అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. అయితే ఇలాంటి సందర్భాల్లో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలిపారు. అలాగే వాటిని రెచ్చగొట్టే ప్రయత్నం చేయకూడదని సూచిస్తున్నారు.
నగర విస్తరణ ఎంత వేగంగా జరిగినా, ప్రకృతి తన ఉనికిని అప్పుడప్పుడు ఇలాంటి ఘటనల ద్వారా గుర్తు చేస్తూనే ఉంటుంది. కేబీఆర్ పార్క్లో కనిపించిన ఈ భారీ కొండచిలువ కూడా హైదరాబాద్లోని జీవవైవిధ్య సంపదకు నిదర్శనంగా నిలిచిందని చెప్పొచ్చు..












