నేడు ఎక్కడ చూసినా కల్తీ ఆహారమే కనిపిస్తోంది. చిన్నపిల్లలు తాగే పాల నుండి, నూనెలు, మసాలాలు, స్వీట్లు, పండ్లు, కూరగాయలు మొదలగు మనిషి బ్రతకడానికి కావలసినవన్నీ కూడా కల్తీమయంగా మారిపోయాయి. చివరికి ఏది స్వచ్ఛమైనదో గుర్తించడం కూడా కష్టంగా మారింది.
వేగవంతమైన జీవనశైలిలో సమయం లేక చాలామంది బయట ఆహారంపై ఆధారపడుతున్నారు. కానీ ఆ ఆహారం నిజంగా మన ఆరోగ్యాన్ని కాపాడుతోందా? లేక నెమ్మదిగా అనారోగ్యాల వైపు నడిపిస్తోందా? అనే విషయం పై దృష్టి సారించడం మరచిపోయారు.
కొన్ని నిమిషాల రుచికోసం తీసుకునే ఆహారం, భవిష్యత్తులో పెద్ద ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందనే విషయాన్ని గుర్తించినా వాటివైపే మొగ్గు చూపిస్తున్నాం.. ఇప్పటికే తరచుగా ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో భయంకరమైన నిజాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ లోని చాంద్రాయణగుట్టలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.
పలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో వాడేసిన వంట నూనెను మళ్లీ వినియోగిస్తున్నట్లు గుర్తించినట్టు అధికారులు పేర్కొన్నారు. అలాగే కృత్రిమ రంగులు కలిపిన చికెన్, ఫుడ్ కలర్స్ స్వాధీనం చేసుకున్నట్టు.. సుమారు 40 కిలోల ఫ్రైడ్ చికెన్ తో పాటు.. మరో 40 కిలోల పచ్చి చికెన్ ను సీజ్ చేసినట్టు వెల్లడించారు. అలాగే ఉపయోగించడానికి సిద్దంగా ఉంచిన 20 లీటర్ల వాడిన నూనె, 10 లీటర్ల తాజా నూనె స్వాధీనం చేసుకున్నట్లుగా అధికారులు తెలిపారు.
నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న రెండు ఆహార కేంద్రాలపై అధికారులు కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో ముగ్గురు నిర్వాహకులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. తనిఖీల సందర్భంగా పలుచోట్ల ఫాస్ట్ ఫుడ్ కేంద్రాల్లో అపరిశుభ్ర పరిస్థితుల్లో ఆహారం తయారు చేస్తున్నట్లు గుర్తించామని తెలిపారు.
ఈ సందర్భంగా అధికారులు పలు సూచనలు చేశారు. ప్రజలు ఆహార పదార్థాలు కొనుగోలు చేసే ముందు FSSAI లైసెన్స్ ఉందో లేదో చూడాలని, అలాగే ఉత్పత్తుల ఎక్స్పైరీ తేదీలను తప్పనిసరిగా పరిశీలించాలని వివరించారు. కల్తీ లేదా నాణ్యతలేని ఆహార విక్రయాలపై ఏవైనా అనుమానాలు ఉంటే H-FAST టోల్ ఫ్రీ నంబర్ 8712661212కు ఫిర్యాదు చేయాలని కోరారు.
ఆహారం కేవలం కడుపు నింపడానికి కాదు.. ఆరోగ్యకరమైన జీవితానికి పునాది. అందుకే బయట ఆహారం ఎంపికలో జాగ్రత్త అవసరం. మనం తినే ప్రతి ముద్దపై అవగాహన పెంచుకోవాలి. ఎందుకంటే ఆరోగ్యం పోతే తిరిగి సంపాదించడం అంత సులభం కాదు.












