తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ బలపడుతున్నదా? లేక అంతర్గత విభేదాలతో తన బలాన్ని తానే బలహీనపరుచుకుంటుందా? అనే ప్రశ్న మరోసారి చర్చకు వచ్చింది. ఇటీవల వనపర్తికి చెందిన ఆటోడ్రైవర్ భరత్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశమైంది. కానీ ఈ ఘటన కేవలం ఒక వ్యక్తి సమస్య కాదు. తెలంగాణ బీజేపీ అంతర్గత సమస్యగా విశ్లేషిస్తున్నారు.
వనపర్తికి చెందిన భరత్ తన ఆటో వెనుక భాగంలో రాసుకున్న కొటేషన్ పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవడంతో వివాదం మొదలైంది. భరత్పై ఒత్తిళ్లు వచ్చాయని, ఆటో ధ్వంసం చేసే ప్రయత్నాలు జరిగాయని, బెదిరింపులు ఎదురయ్యాయని ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితిలో అతను సహాయం కోసం బీజేపీ నాయకులను సంప్రదించినప్పుడు చివరకు అతడిని బండి సంజయ్ వద్దకు తీసుకెళ్లారు.
రాష్ట్ర బీజేపీలో అనేక మంది పెద్ద నాయకులు ఉన్నప్పటికీ, కింది స్థాయి కార్యకర్తలు, సాధారణ హిందుత్వ భావజాలం కలిగిన వ్యక్తులు ఇబ్బందుల్లో పడితే ముందుగా గుర్తొస్తున్న నాయకుడు బండి సంజయ్ కావడం. ఇది ఒక రాజకీయ నాయకుడు తన వ్యక్తిగత శైలితో, పోరాట పద్ధతితో సంపాదించుకున్న నమ్మకం అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ఆయన రాజకీయ ప్రయాణం కూడా అదే విషయాన్ని చెబుతుంది.
కింది స్థాయి కార్యకర్తగా మొదలై, కార్పొరేటర్గా, ఎంపీగా, రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగిన బండికి కేడర్తో ప్రత్యక్ష అనుబంధం ఉంది. ఉద్యమాల్లో పాల్గొనడం, రోడ్డుపైకి రావడం, వివాదాస్పద అంశాల్లో కూడా నేరుగా స్పందించడం వంటి లక్షణాలు ఆయనకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. భాగ్యలక్ష్మి ఆలయం దగ్గరైనా, ఓల్డ్ సిటీ రాజకీయాల మధ్యైనా తన అభిప్రాయాన్ని బహిరంగంగా చెప్పగల నాయకుడిగా ఆయన ఇమేజ్ ఏర్పడింది.
అయితే అదే సమయంలో బండి సంజయ్ చుట్టూ పార్టీలో వ్యతిరేక వర్గం కూడా బలపడిందనే అభిప్రాయం చాలా కాలంగా వినిపిస్తోంది. కరీంనగర్లో తన ప్రభావాన్ని నిరూపించుకున్న బండి సంజయ్కు, రాష్ట్ర రాజకీయాల్లో ఎదుగుదలతో పాటు ప్రత్యర్థులు కూడా పెరిగారు. వేర్వేరు ప్రాంతాలకు చెందిన నాయకులు, వేర్వేరు రాజకీయ నేపథ్యాలతో వచ్చిన నేతలు, స్థానిక సమీకరణాలు... ఇవన్నీ కలిసి పార్టీ అంతర్గత పోటీని పెంచాయి.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బండి సంజయ్ నేతృత్వంలో పార్టీ వేగంగా ఎదిగిందనే వాదన ఒకవైపు ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై దూకుడుగా వ్యవహరించడం.. నిరుద్యోగులు, రైతులు, హిందుత్వ అంశాలపై నిరంతరం ఉద్యమాలు చేయడం వల్ల పార్టీకి గ్రామ స్థాయి వరకు గుర్తింపు పెరిగిందని ఆయన అనుచరులు చెబుతారు. అదే సమయంలో ఆయనను అధ్యక్ష పదవి నుంచి తప్పించడం వెనుక రాజకీయ కారణాలే ఉన్నాయని కూడా వారు ఆరోపిస్తుంటారు.
ఇక ఇటీవల కాలంలో బండి సంజయ్ కుటుంబానికి సంబంధించిన వివాదాలు, ముఖ్యంగా ఆయన కుమారుడు భగీరథ్కు సంబంధించిన అంశాలు రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీశాయి. ప్రత్యర్థి పార్టీలు మాత్రమే కాదు, సొంత పార్టీలోని వ్యతిరేక వర్గాలు కూడా ఈ అంశాన్ని రాజకీయ ఆయుధంగా ఉపయోగించుకున్నాయనే వాదనలు ఉన్నాయి. కేంద్ర మంత్రి పదవి పోతుందని, ఆయన రాజకీయ జీవితం ఇక ముగిసిపోతుందని ప్రచారం సైతం జరిగింది.
అయితే వనపర్తి భరత్ ఘటన మరో విషయాన్ని బయటపెట్టిందని విశ్లేషకులు అంటున్నారు. నాయకుడి పదవి కంటే ప్రజల్లో, కేడర్లో ఉన్న నమ్మకమే ముఖ్యమని. పదవులు మారవచ్చు, బాధ్యతలు మారవచ్చు. కానీ ఒక నాయకుడు కష్టకాలంలో అండగా నిలబడతాడనే భావన ఏర్పడితే అది రాజకీయంగా పెద్ద బలం అవుతుందని.. ఇక్కడే తెలంగాణ బీజేపీ భవిష్యత్తుపై ప్రశ్నలు మొదలవుతున్నాయి.
పార్టీ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలంటే కేడర్కు దగ్గరగా ఉన్న నాయకులను బలోపేతం చేయాలా? లేక అంతర్గత విభేదాలు, వర్గ రాజకీయాలకు ప్రాధాన్యం ఇవ్వాలా? అనే చర్చ కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల సమయంలో ప్రచారంపై వచ్చిన విమర్శలు, పార్టీ నాయకత్వం మధ్య సమన్వయ లోపాలపై వచ్చిన ఆరోపణలు, బీఆర్ఎస్తో కొందరు నేతలు సాఫ్ట్గా వ్యవహరిస్తున్నారనే ప్రచారం.. ఇవన్నీ కలిపి తెలంగాణ బీజేపీపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.
అధికారాన్ని లక్ష్యంగా పెట్టుకున్న బిజెపికి ఇవి చిన్న విషయాలు కావు. చివరికి వనపర్తి భరత్ ఘటన ఒక రాజకీయ సందేశాన్ని ఇస్తోంది. పార్టీ కార్యాలయాల్లో కాకుండా, కిందిస్థాయి కార్యకర్తల మనసుల్లో ఎవరు ఉన్నారు? ఇబ్బంది వచ్చినప్పుడు ఎవరు జనం మధ్య ఉన్నారు! అనే విషయాన్ని గమనిస్తే వారిలో బండి సంజయ్ పేరు వినిపిస్తుందని తెలుస్తుంది.
అయితే ఈ అవకాశాన్ని పార్టీ సమిష్టి బలంగా మార్చుకుంటుందా? లేక అంతర్గత విభేదాలతోనే ముందుకు సాగుతుందా? అన్నదే రాబోయే రోజుల్లో తెలంగాణ బీజేపీ భవిష్యత్తును నిర్ణయించే కీలక అంశంగా మారబోతోందని తెలుస్తుంది..












