Fauzi: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ సినిమా ఒకటి మొదలైందంటే, ఆ సినిమాకి సంబందించిన అప్డేట్స్ కోసం ఆయన అభిమానులే కాదు, ప్రపంచవ్యాప్తంగా సినీ లవర్స్, ఇండస్ట్రీ వర్గాలు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తారు. ఆ కటౌట్ చూసి ఏదైనా నమ్మేయాలి డ్యూడ్ అని ఫ్యాన్స్ చెప్పుకోవడంలో ఎంతమాత్రం ఆశ్చర్యం లేదు. మిర్చి సినిమాలో ఉన్న డైలాగ్ ఆయన కోసమే రాసింది.
బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ సినిమా పోస్టర్ ఏది వచ్చినా, సోషల్ మీడియా షేకవుతోంది. అంతేకాదు, ప్రీ బిజినెస్ కూడా ఏ ఒక్కరూ ఊహించని విధంగా జరుగుతోంది. ఇంకా చెప్పాలంటే ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఒక్కటే థియేట్రికల్, డిజిటల్ రైట్స్ అమ్ముడవడానికి కారణం అవుతున్నాయి. ఇప్పుడు, కూడా ఫౌజీ సినిమా పోస్టర్ చూసి సోషల్ మీడియా మొత్తం ఒకటే చర్చ జరుగుతోంది.
ఈ ఏడాది ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో రూపొందుతున్న స్పిరిట్ సినిమా నుంచి ప్రభాస్, హీరోయిన్ త్రిప్తి డిమ్రీల లుక్ తో ఎలాంటి సునామీ వచ్చిందో అందరికీ తెలిసిందే. అలాగే, తాజాగా వచ్చిన ఫౌజీ లుక్ తర్వాత బిజినెస్ లెక్కలు మారిపోయాయట. భారీ మొత్తానికి ఈ సినిమా ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైనట్టుగా తెలుస్తోంది. ప్రభాస్ పోస్టర్ లో ఉన్న మెయిన్ హైలెట్స్ జంజం..ఒంటినిండా రక్తం..చేతిలో ఉన్న పొడవాటి ఖడ్గం..ఇవన్నీ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అనే ఆసక్తిని పెంచేసింది. ఓ యుద్ధవీరుడి పాత్రలో డార్లింగ్ కనిపిస్తాడని సమాచారం.
దర్శకుడు హను రాఘవపూడి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇమాన్వీ ఇస్మాయెల్ హీరోయిన్గా తెలుగు తెరకి పరిచయం అవుతోంది. స్వాతంత్ర్యానికి ముందు జరిగే కథ అని కూడా లీకులు ద్వారా అర్థమవుతోంది. కేవలం పోస్టర్స్తోనే ఊహించని బిజినెస్ అవుతున్న స్పిరిట్, ఫౌజీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచనలనాత్మకమైన విజయాలను అందుకుంటాయో చూడాలి.












