రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో అక్రమ వడ్డీ వ్యాపారులు యథేచ్ఛగా దందా సాగిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అమాయక ప్రజలను ఆసరాగా చేసుకుని, కొందరు వ్యాపారులు పరిమితికి మించిన అక్రమ వడ్డీలతో వారి రక్తాన్ని పిండుతున్నారు. గ్రామంలోని కల్లు మండపాలు, హోటళ్లు, రద్దీ కూడళ్ల వద్ద డబ్బు అత్యవసరమున్న వారిని పసిగట్టడానికి ఒక మధ్యవర్తిని ఏర్పాటు చేసుకున్నారు.
ఇలా ఆపదలో ఉన్న వారిని గుర్తించి అప్పులు ఇచ్చి, కేవలం మూడు నెలల్లోనే రెట్టింపు మొత్తాన్ని నూరిపోస్తూ తీవ్రంగా వేధిస్తున్నారు.ఈ అక్రమ వ్యాపారంలో కీలక సూత్రధారిగా వ్యవహరిస్తున్న మధ్యవర్తి, బాధితుల నుంచి విందులు (దావత్లు) పొందడమే కాకుండా అప్పు ఇప్పించినందుకు భారీగా కమీషన్లు వసూలు చేస్తున్నాడు. ఇటీవల గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి రూ.20వేల రుణం ఇప్పించిన ఈ దళారీ, అందులోంచి రూ.2వేల కమీషన్గా నొక్కేశాడు.
దీంతో బాధితుడి చేతికి రూ.18,000 మాత్రమే దక్కగా, ప్రైవేటు వడ్డీ వ్యాపారి మాత్రం పత్రాలపై ఏకంగా రూ.30వేలు అప్పు తీసుకున్నట్లు బలవంతంగా సంతకాలు చేయించుకున్నాడు. తీవ్ర నిరుపేదరికంలో ఉన్న ఆ బాధితుడు గడువు ముగిశాక కొంత సమయం ఇవ్వాలని ప్రాధేయపడినా ఆ వడ్డీ వ్యాపారి కనికరించలేదు. కనీసం తాత్కాలికంగా అసలు మొత్తం రూ.వేలు తీసుకుని, మిగిలిన బకాయికి వ్యవధి ఇవ్వాలని వేడుకున్నా వినకుండా దౌర్జన్యానికి దిగాడు.
బాకీ పడ్డ మొత్తం వెంటనే తీర్చకపోతే కుటుంబంతో సహా వచ్చి ఇంటి ముందే కూర్చుని రచ్చ చేస్తామని, లేదా మధ్యవర్తితో దాడి చేయిస్తామని తీవ్రంగా బెదిరింపులకు పాల్పడ్డాడు. అక్రమ వడ్డీ దందాను అరికట్టేందుకు పోలీస్ యంత్రాంగం నిఘా పెట్టినప్పటికీ, క్షేత్రస్థాయిలో ప్రైవేటు వడ్డీ రాబందులు ఎలాంటి భయం లేకుండా చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి బాధితులు ఇంకా చాలామంది ఉన్నట్లు సమాచారం అందుతోంది. అధిక వడ్డీ నెట్వర్క్పై పోలీసులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.












