ఎల్ నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో నీటి కష్టాలు తప్పవంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వర్షాకాలం ప్రారంభమై దాదాపు రెండు నెలలు కావస్తున్న నేపథ్యంలో.. తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయన్న వాతావరణ హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. భవిష్యత్లో తలెత్తే నీటి కొరతను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రైతులకు కీలక సూచనలు కూడా చేసింది.
ఈ నేపథ్యంలో తాజాగా ఇస్రో శాటిలైట్స్, ఐఎండీ శుభవార్త చెప్పింది. దేశంలో రుతుపవనాలు మళ్లీ బలపడుతున్నాయని దేశంలో 70 శాతం మేఘాలు కమ్ముకున్నాయని వెల్లడించింది. అలాగే ఇప్పుడు వచ్చేవి సాధారణ మేఘాలు కావని రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు అంచనా వేసింది. ముఖ్యంగా ఈశాన్య, ఉత్తరాది రాష్ట్రాల్లో భారీనుంచి అతిభారీ వర్షాలు, దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది.
మరోవైపు హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ కాగా.. ఢిల్లీ సహా పలు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. దీంతో రానున్న రోజుల్లో వర్షాల తీవ్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక ఐఎండీ అంచనాల ప్రకారం.. రాబోయే నాలుగు నుంచి ఐదు రోజుల పాటు వాయువ్య, ఈశాన్య భారతదేశంతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, తూర్పు మధ్యప్రదేశ్, గోవా, మహారాష్ట్ర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
అలాగే ఉపగ్రహ చిత్రాల్లో మేఘాల విస్తీర్ణం మారుతూ కనిపిస్తున్నప్పటికీ.. వాటి తీవ్రత మాత్రం క్రమంగా పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. ఫలితంగా అండమాన్ నికోబార్, ఒడిశా, జార్ఖండ్, రాజస్థాన్, తెలంగాణాలో రానున్న మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది.












