తెలంగాణ

Telangana: తెలంగాణ బీజేపీలో తగ్గని ఆధిపత్య పోరు!..

రచన: Venu6 నిమిషాల పఠనం

రెండోసారి ఎంపీలుగా గెలిచిన తర్వాత ఈ ఇద్దరు నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి విభేదాలు చేరినట్టు ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య కొన్నాళ్లుగా జరుగుతున్న ఈ ఆధిపత్య పోరు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది!..

క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచి, పక్కా కేడర్‌ బలంతో దూసుకెళ్తూ.. కేంద్రంలో తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్న పార్టీ బీజేపీ అని చెబుతారు.. కానీ పువ్వు గుర్తులో ఉన్న తెలంగాణ నేతల తీరు చూస్తుంటే మాత్రం.. సొంత ఇంటిని సరిదిద్దుకోలేక పొరుగువారిపై పోరు అన్నట్లు తయారైందనే విమర్శలు వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు బిజెపి అగ్రనేతలు, ఎంపీలు అయిన బండి సంజయ్ కుమార్, ధర్మపురి అరవింద్ మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి.

రెండోసారి ఎంపీలుగా గెలిచిన తర్వాత ఈ ఇద్దరు నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి విభేదాలు చేరినట్టు ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య కొన్నాళ్లుగా జరుగుతున్న ఈ ఆధిపత్య పోరు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది!.. మరోవైపు తెలంగాణ బీజేపీని బలోపేతం చేయడంలో ఈ ఇద్దరిదీ కీలక పాత్రే. అయితే, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ మధ్య అధిపత్య పోరు మాత్రం మొదటి నుంచీ స్పష్టంగా కనిపిస్తోంది.

ఆమధ్య బండి సంజయ్ తనయుడికి సంబంధించిన ఒక వివాదాస్పద అంశంలో... పరోక్షంగా అరవింద్ వర్గమే వెనుక ఉండి ఈ తతంగం నడిపించిందనే ఆరోపణలు బండి వర్గం నుండి బలంగా వినిపించాయి. అలాగే జగిత్యాలలో రాజకీయ పట్టు సాధించే విషయంలో ఇద్దరి మధ్య రోజురోజుకూ దూరం పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో నా నియోజకవర్గ పరిధిలో వేరొకరి జోక్యాన్ని, ఆధిపత్యాన్ని సహించేదే లేదని అరవింద్ బహిరంగంగానే సంకేతాలు ఇవ్వడం ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది.

ఇది బయటకు చిన్న విషయంగా కనిపించినా... ఈ రెండు వర్గాల మధ్య పెద్ద యుద్దమే నడుస్తోందనే ప్రచారం జరుగుతుంది.. ఈ క్రమంలో తాజాగా ఈ విభేదాలు మరో కొత్త మలుపు తిరిగాయి!.. ఈ మధ్యకాలంలో టీడీపీ..రేవంత్ అనుకూల డిజిటల్ మీడియాలో అరవింద్ కు వ్యతిరేకంగా కథనాలు వచ్చాయి.. ఈ అంశంపై తీవ్రంగా మండిపడిన అరవింద్.. రంగంలోకి దిగడంతో సదరు మీడియా సంస్థ వెంటనే ఆ కథనాన్ని ఆన్‌లైన్ నుండి తొలగించిందని సమాచారం..

ఇక ఒక యూట్యూబర్‌తో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో అరవింద్ చేసిన వ్యాఖ్యలు బీజేపీలో పెద్ద తుఫానే సృష్టించాయి. ఆ వార్త రాసిన మహిళా జర్నలిస్ట్ ఎవరో నాకు తెలుసు.. ఆమెతో ఎవరు రాయించారో, ఏ పార్టీ నాయకులు వెనుక ఉండి నడిపించారో ఆ తతంగం అంతా నాకు తెలుసని అరవింద్ వ్యాఖ్యానించడం బీజేపీలో అంతర్గత విభేదాలను బయట పెట్టాయి.. మరోవైపు, బండి సంజయ్ వర్గం ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తోంది.

తనకు సన్నిహితంగా ఉండే ఒక యూట్యూబర్‌ని వాడుకుని.. అరవింద్ కావాలనే బండి సంజయ్‌పై బురద చల్లేందుకు ఈ తరహా ఎత్తుగడలు వేస్తున్నారని ఆయన అనుచరులు ఆరోపణలు గుప్పిస్తున్నారు.. అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్ఎస్‌ తీరును ఈ పార్టీ లోపాలను ప్రజల్లోకి తీసుకెళ్ల వలసిన సమయంలో బీజేపీ ముఖ్య నేతలే ఇలా వీధిపోరాటాలకు దిగడం ప్రత్యర్థి పార్టీలకు బలమైన ఆయుధంగా మారుతుందనే ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు..

ఇక క్రమశిక్షణకు మారుపేరు అని చెప్పుకునే బీజేపీలో నెలకొన్న అంతర్గత విభేదాలు, కుమ్ములాటలు ఏ స్థాయిలో ఉన్నాయో ఈ వివాదంతో స్పష్టమవుతోందని కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఢిల్లీ పెద్దలు ఎన్నిసార్లు హెచ్చరించినా, రాష్ట్రంలో పదవులు మారినా.. బండి సంజయ్, ధర్మపురి అరవింద్ మధ్య ఉన్న పాత కక్షలు, వ్యక్తిగత విభేదాలు మాత్రం తగ్గడం లేదు. ఈ ఇద్దరు బీసీ అగ్రనేతల నడుమ సాగుతున్న ఈ పరోక్ష యుద్ధం రాబోయే రోజుల్లో తెలంగాణ బీజేపీ భవిష్యత్తును, కేడర్ మనోధైర్యాన్ని దెబ్బతీస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.. మరి బీజేపీ అధిష్టానం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి..

#Telangana#BJP#political war#Bandi Sanjay#Dharmapuri Arvind#MP#congress#brs
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి