Ponguleti Srinivas Reddy: బీఆర్ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి. అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ చేసిన విధ్వంసాన్ని సరిదిద్దేందుకు పదేళ్లు పడుతుందని అంటారా? అంటూ బీఆర్ఎస్ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి విధ్వంసం చేసింది మీరే అంటూ ఆయన ఎదురుదాడికి దిగారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ధనిక తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిందని.. రూ.8.21 లక్షల కోట్ల అప్పు చేసి మా నెత్తిన పెట్టిందని ధ్వజమెత్తారు. ఆర్థిక సంక్షోభం ఉన్నా అభివృద్ధి, సంక్షేమాన్ని అందిస్తున్నామని వివరించారు మంత్రి పొంగులేటి.
''తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజులను పూర్తి చేసుకుంది. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన సూపర్ హిట్. దొరల పాలన ఒక పక్కన.. వెయ్యి రోజుల పాలన మరో పక్కన. గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన అనేక కార్యక్రమాలను మేము కొనసాగిస్తున్నాము. ఇప్పటివరకు ఒక్క ప్రభుత్వ కార్యక్రమాన్ని కూడా బీఆర్ఎస్ మెచ్చుకోలేదు. ఉప ఎన్నికల్లో ఓడిపోయినా బీఆర్ఎస్ నేతల్లో మార్పు రాలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గుండు సున్నా.. డిపాజిట్లు కూడా దక్కలేదు. బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్ వల్లే బీఆర్ఎస్ కు పార్లమెంటు ఎన్నికల్లో డిపాజిట్లు దక్కలేదు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య బంధాన్ని ఓపెన్ గా ఒప్పుకోవాలి'' అని మంత్రి పొంగులేటి అన్నారు.
''బీఆర్ఎస్ సర్కార్ 6 లక్షల కోట్ల అప్పు చేసింది. అప్పుల భారాన్ని మా నెత్తిన పెట్టి పోయారు. బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులను మోసం చేస్తూ పేపర్ లీక్స్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక టీజీపీఎస్ సీని ప్రక్షాళన చేశాం. బీఆర్ఎస్ నేతలవి అభూత కల్పనలు, పచ్చి అబద్ధాలు. బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు అయినా ఇచ్చారా? బీఆర్ఎస్ నేతలు హద్దు మీరి మాట్లాడితే ప్రజలు క్షమించరు'' అని మంత్రి పొంగులేటి వార్నింగ్ ఇచ్చారు.












