Konda Surekha: ఇప్పటికే కూతురి వ్యాఖ్యలతో తీవ్ర వివాదంలో చిక్కుకున్న మంత్రి కొండా సురేఖ.. తగ్గేదే లేదు అంటున్నారు. ఈసారి ఏకంగా సీఎం రేవంత్ ను టార్గెట్ చేశారామె. ముఖ్యమంత్రిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ పెద్దలు తనపై చర్యలు తీసుకునే ముందు సీఎం రేవంత్ పై చర్యలు తీసుకోవాలని మంత్రి కొండా సురేఖ డిమాండ్ చేశారు. ఎవరిని అడిగి ముఖ్యమంత్రి రేవంత్ ఎమ్మెల్యే టికెట్లు ప్రకటిస్తున్నారు? అని కొండా సురేఖ నిలదీశారు.
పదేళ్ల పాటు నేనే సీఎం అని రేవంత్ చెప్పుకోవడం వల్ల మంత్రులు, నేతలు అసంతృప్తిగా ఉన్నారని ఆమె తెలిపారు. ఇక, రాజీనామా చేయాలని తనతో ఇప్పటివరకు ఎవరూ చెప్పలేదన్నారు. పార్టీ పెద్దల నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్లు వెల్లడించారు. బీసీనైన నాకు ఒక న్యాయం, ఇతర సామాజికవర్గాలకు మరో న్యాయమా? అని కొండా సురేఖ ప్రశ్నించారు. ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ లో మంత్రి కొండా సురేఖ ఈ వ్యాఖ్యలు చేశారు.
''ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశా. కేసీ వేణుగోపాల్ తో ఇంకా మాట్లాడలేదు. పార్టీ పెద్దల నిర్ణయం కోసం వేచి చూస్తున్నా. రాజీనామా చేయాలని ఇప్పటివరకు నాకు ఎవరూ చెప్పలేదు. నా మీద చర్యలు తీసుకునే ముందు ముఖ్యమంత్రి రేవంత్ పై తీసుకోవాలి. ఎవరిని అడిగి ముఖ్యమంత్రి టికెట్లు ప్రకటిస్తున్నారు? నేతలపై పెద్దఎత్తున అవినీతి, అక్రమాల ఆరోపణలు వస్తున్నాయి.
నా కూతురు మాట్లాడిన దానికి నన్ను ఎలా బాధ్యులు చేస్తారు? నన్ను కావాలనే టార్గెట్ చేస్తున్నారు. బీసీనైన నాకో న్యాయం, ఇతర సామాజికవర్గాలకు మరో న్యాయం పాటిస్తారా? క్యాబినెట్ లో ఉన్న ఇతర సామాజికవర్గాల వారిపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. వాటన్నింటికీ ఏం సమాధానం చెబుతారు, ఆయా సామాజికవర్గాల మంత్రులపై ఏం చర్యలు తీసుకుంటారు? పార్టీలోని అన్ని వ్యవహారాలపై ఇప్పటికే మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా అధిష్టాన ముఖ్యులందరికీ రాతపూర్వకంగా తెలియజేశాను. అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలని ఖర్గేను కోరాను'' అని కొండా సురేఖ తెలిపారు.









