Indiramma Illu: ఇందిరమ్మ ఇల్లు- CURE ఏరియా పథకానికి సంబంధించి ఓ ప్రచారం జోరుగా నడుస్తోంది. ఆ ప్రచారం ప్రజలను గందరగోళానికి, అంతకుమించి ఆందోళనకు గురి చేసేలా ఉంది. ఇంతకీ ఆ ప్రచారం ఏంటంటే.. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇంటి కోసం అప్లయ్ చేసుకుంటే వారికి ఇతర పథకాలు నిలిచిపోతాయట. ఇప్పటివరకు అందుతున్న బెనిఫిట్స్ ఆగిపోతాయట. ఈ మేరకు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం నడుస్తోంది. ఇది నిజమేనేమో అని నమ్మి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
వదంతులు నమ్మొద్దు..
తాజాగా వారికి రిలీఫ్ దక్కేలా అధికారిక ప్రకటన వచ్చింది. ఈ ప్రచారంపై తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వీపీ గౌతమ్ స్పందించారు. ఆ ప్రచారాన్ని ఆయన ఖండించారు. అందులో నిజం లేదని చెప్పారు. అంతేకాదు ఇందిరమ్మ ఇళ్ల పథకంపై వచ్చే వదంతులను అస్సలు నమ్మొద్దని ప్రజలకు సూచించారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేస్తే ఇతర పథకాలు నిలిచితాయన్న ప్రచారం అబద్ధమన్నారు. అలాంటిదేమీ జరగదన్నారు. ఇతర స్కీమ్స్ ఏవీ కూడా నిలిచిపోవని గౌతమ్ తేల్చి చెప్పారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో వీడియో రిలీజ్ చేశారు.
స్థలం లేని వారికి సొంతింటి కల నెరవేర్చడమే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం అని గౌతమ్ చెప్పారు. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. దీని వల్ల ఇతర పథకాలపైన కానీ, ప్రయోజనాలపైన కానీ ఎలాంటి ప్రభావం ఉండదని అభయం ఇచ్చారు. తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గౌతమ్ హెచ్చరించారు.
ఇతర పథకాలన్నీ కొనసాగుతాయి..
''పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు టవర్స్ స్కీమ్ ని తీసుకొచ్చింది. 6 లక్షలు లోపు ఆదాయం ఉన్న వారంతా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే. బీపీఎల్ వర్గాలకు చెందిన వారే అప్లయ్ చేసుకుంటారు. వారికి మిగతా స్కీమ్స్ వస్తున్నాయో అవన్నీ కంటిన్యూ అవుతాయి. అందులో ఏ మాత్రం సందేహం లేదు. సోషల్ మీడియాలో కొందరు వదంతులు వ్యాపింపజేస్తున్నారు. వాటిని ఎవరూ నమ్మొద్దు. దానిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా చూస్తున్నాం.
4 దఫాల్లో 6లక్షలు చెల్లింపు..
ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేయడం వల్ల మిగతా ఏ స్కీమ్ పై ప్రభావం అనేది ఉండదు. ఇందులో బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ 6 లక్షలు ఉందో.. దాన్ని 4 దఫాల్లో చెల్లించాలి. తొలుత ఇల్లు అలాట్ అయిన వెంటనే లక్ష రూపాయలు కట్టాలి. తర్వాత ప్రతి మూడు నెలలకు డబ్బులు కట్టాలి. 2 లక్షలు, 2 లక్షలు చెల్లించాలి. చివరలో లక్ష కట్టాల్సి ఉంటుంది.
6 లక్షలు కడితే ధనవంతులు అయిపోరు..
వారు 6 లక్షలు కడుతున్నారు కాబట్టి వారు ధనవంతులు అనడం తప్పు. పేదలు కూడా డబ్బులు పొదుపు చేసి కట్టుకుంటారు. అలాగే చాలా మంది లోన్స్ తీసుకుని కూడా కడతారు. ఈ ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ వల్ల ఇతర పథకాలు కట్ అవుతాయి అనేది ఉండదు. అలాంటి వదంతులను అస్సలు నమ్మొద్దు. ఆ వదంతులను వ్యాప్తి చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం'' అని తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ గౌతమ్ చెప్పారు.
ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి..












