Kolkata Train Fire: కోల్ కతాలోని దక్షిణేశ్వర్ రైల్వే స్టేషన్ లో ఒక్కసారిగా కలకలం రేగింది. ట్రైన్ పైన మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణ భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ట్రైన్ పై ఉండే విద్యుత్ తీగల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్ద పెద్ద శబ్దాలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు బాగా భయపడిపోయారు. రైలు నుంచి దిగేసి దూరంగా పరుగులు తీశారు. అసలు ఏం జరిగిందో వారికి అర్థం కాలేదు. అయితే, పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదు. దీనిపై రైల్వే శాఖ అధికారులు విచారణకు ఆదేశించారు. మంటలు చెలరేగడానికి గల కారణాలను తెలుసుకునే పనిలో పడ్డారు.
బుధవారం రాత్రి దక్షిణేశ్వర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓవర్హెడ్ విద్యుత్ తీగ తెగిపోవడంతో ఈ ఘటన జరిగింది. రద్దీగా ఉండే సీల్దా-దంకునీ మార్గంలో రైలు సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మంటలు చెలరేగడంతో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ కారణంగా అప్, డౌన్ లైన్లలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వందలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నెట్వర్క్ కు తీవ్ర అంతరాయం కలిగింది. రాత్రి సుమారు 8:50 గంటలకు ఓవర్హెడ్ పరికరాల్లో లోపం తలెత్తడంతో దంకునీ-సీల్దా డౌన్ లోకల్ రైలు నిలిచిపోయింది. రైల్వే ఇంజనీర్లు అత్యవసర మరమ్మత్తు పనులు చేపట్టారు. ఆ మార్గంలో రైలు రాకపోకలను నిలిపివేశారు.
దెబ్బతిన్న ఓవర్హెడ్ తీగను రిపేర్ చేయడానికి రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు. రిపేర్ పనుల కారణంగా రెండు లైన్లలోనూ రైలు కార్యకలాపాలు చాలా గంటల పాటు నిలిచిపోయాయి.
ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి..












