పశ్చిమ బెంగాల్లో మాజీ ప్రభుత్వ బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.28 కోట్లకు పైగా నగదు, 15 కిలోల బంగారం లభించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక సాధారణ ఉద్యోగిగా రిటైర్ అయిన వ్యక్తి ఇంట్లో ఇంత భారీ మొత్తంలో నగదు, బంగారం బయటపడటం సహజంగానే అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనతో మరోసారి దేశ రాజకీయాల్లో బినామీ వ్యవస్థ, అవినీతి డబ్బు, రాజకీయ-వ్యాపార సంబంధాలపై తీవ్ర చర్చ మొదలైంది.
గత కొన్నేళ్లుగా దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈడీ, సీబీఐ, ఆదాయపు పన్ను శాఖలు నిర్వహించిన సోదాల్లో భారీ మొత్తంలో నగదు, బంగారం, ఆస్తుల పత్రాలు బయటపడిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. చాలాసార్లు ఆస్తులు నేరుగా నేతల పేర్లలో కాకుండా.. బంధువులు, సన్నిహితులు, ఉద్యోగులు లేదా నమ్మకస్తుల పేర్లలో ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. అందుకే ఈ ఘటన కూడా అదే తరహా బినామీ వ్యవహారమా? అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
ఈ కేసులో అదుపులోకి తీసుకున్న మాజీ బస్సు డ్రైవర్ మినార్ మండల్.. స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం తనది కాదని, తన బావ ఇంట్లో దాచిపెట్టాడని పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఈ వాదనతో కేసు మరింత ఆసక్తికరంగా మారింది. నిజంగా అతను చెప్పింది వాస్తవమేనా? లేక దర్యాప్తును తప్పుదోవ పట్టించే ప్రయత్నమా? అనేది విచారణలో తేలాల్సి ఉంది.
మరోవైపు ఈ ఘటనపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తూ.. ఇది తృణమూల్ కాంగ్రెస్కు చెందిన అవినీతి డబ్బని ఆరోపిస్తోంది. ఇక ఇలాంటి ఘటనలు బయటపడిన ప్రతిసారీ బినామీ ఆస్తులపై చట్టాలు మరింత కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అక్రమంగా సంపాదించిన డబ్బును ఇతరుల పేర్లపై దాచిపెట్టే వ్యవస్థను నిర్మూలించకపోతే అవినీతిని అరికట్టడం కష్టమేనని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం పోలీసులు, దర్యాప్తు సంస్థలు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నాయి. మాజీ డ్రైవర్ చెప్పిన వివరాలు ఎంతవరకు నిజం? ఆ డబ్బు వెనుక అసలు యజమానులు ఎవరు? రాజకీయ సంబంధాలు ఉన్నాయా? లేదా వ్యక్తిగత అక్రమ సంపాదనా? అన్న ప్రశ్నలకు సమాధానం విచారణలో బయటపడుతాయి.












