నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. వర్షాల కారణంగా రోడ్లపై ట్రాఫిక్ స్తంభించకుండా, ఐటీ ఉద్యోగులు సురక్షితంగా ఇంటికి చేరుకునేందుకు వీలుగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కమిషనరేట్ కీలక సూచనలు చేసింది.సైబరాబాద్ పరిధిలోని ఐటీ కంపెనీలు, ఇతర ప్రైవేట్ సంస్థలు వీలైనంత వరకు తమ సిబ్బందికి వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యాన్ని కల్పించాలని కోరింది.
ఆ సదుపాయం కల్పించేని కంపెనీలు .. ఆఫీసుల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ట్రాఫిక్ చిక్కులు తప్పేలా గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచే విడతల వారీగా ముందస్తు లాగౌట్ కోసం అనుమతి ఇవ్వాలని సంస్థలను కోరింది.అలా చేయడం వలన ఒకవేళ సాయంత్రం వర్షం తీవ్రంగా ఉన్నా.. ట్రాఫిక్ చిక్కులు కాస్త తగ్గే చాన్స్ ఉంది. ఒకే సమయంలో అందరూ ఒకేసారి రోడ్లపైకి వస్తే ఐటీ కారిడార్ (మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో) తీవ్ర ట్రాఫిక్ జామ్స్ ఏర్పడి గంటల తరబడి వాహనదారులు ఇబ్బందులు పడాల్సి రావొచ్చని ముందే హెచ్చరించింది.అందుకే విడతల వారీగా లాగౌట్కు అనుమతులు ఇవ్వాలని పోలీసులు సూచించారు.












