Telangana High Court: తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్ మెంట్ (NITHM-నిథమ్) డైరెక్టర్గా ప్రొఫెసర్ వేదుళ్ల వెంకట రమణ నియామకాన్ని రద్దు చేసింది. చట్ట నిబంధనల ఉల్లంఘన జరిగిందంటూ కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 206ను సైతం న్యాయస్థానం క్యాన్సిల్ చేసింది. సెంటర్ ఫర్ బెటర్ గవర్నెన్స్ అనే స్వచ్చంద సంస్థ దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు.. ఈ తీర్పును వెలువరించింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిథమ్ ఏర్పాటైంది. సంస్థ అధికారిక నిబంధనల ప్రకారం డైరెక్టర్ నియామకానికి కావాల్సిన అర్హతలను నిర్ణయించే, నియామకం చేపట్టే సర్వ అధికారాలు కేవలం దాని గవర్నింగ్ కౌన్సిల్ కు మాత్రమే ఉంటాయి. అయితే, ఈ నిబంధనను పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ జూలై 15 2025న హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి చెందిన మేనేజ్ మెంట్ ప్రొఫెసర్ వెంకట రమణను మూడేళ్ల డెప్యుటేషన్ పై నేరుగా నిథమ్ డైరెక్టర్ గా నియమించింది. దీనిపై సెంటర్ ఫర్ బెటర్ గవర్నెన్స్ సంస్థ కోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర ప్రభుత్వం చట్టపరమైన నిబంధనలను, రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ఈ నియామకాన్ని కోర్టులో సవాల్ చేసింది.
ఈ పిటిషన్ పై వాదనలు విన్న న్యాయస్థానం.. కీలక తీర్పు ఇచ్చింది. నియామక ప్రక్రియ లోపభూయిష్టంగా ఉందని, నిథమ్ నిబంధనలకు, రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని పేర్కొంటూ.. జీవో నెంబర్ 206 చెల్లదని ప్రకటించింది. ఆ నియామకాన్ని తక్షణమే రద్దు చేసింది. పారదర్శకత లేకుండా ప్రభుత్వం అక్రమంగా, ఏకపక్షంగా ప్రభుత్వ పదవుల్లో నియామకాలు చేపడితే పౌర సమాజం ఊరుకోదని ఈ తీర్పు అధికారులకు స్పష్టమైన హెచ్చరిక పంపుతోందని సెంటర్ ఫర్ బెటర్ గవర్నెన్స్ ఉపాధ్యక్షుడు డాక్టర్ చంద్రశేఖర్ అన్నారు.












