Telangana High Court: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తీరుపై తెలంగాణ హైకోర్టు ఫైర్ అయ్యింది. హైడ్రా కమిషనర్ పదవి నుంచి రంగనాథ్ ను వెంటనే తప్పించాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం. లోతుకుంట ప్రైవేట్ భూముల వ్యవహారంలో హైడ్రా జోక్యాన్ని న్యాయస్థానం తీవ్రంగా తప్పుపట్టింది. రంగనాథ్ పై 63కి పైగా కోర్టు ధిక్కరణ పిటిషన్లు నమోదయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఒక అధికారిపై ఇన్ని ధిక్కరణ కేసులు ఎందుకు నమోదయ్యాయని ప్రశ్నించింది. సెక్రటరీ ర్యాంక్ స్థానంలో ఉన్న ఉన్నతాధికారి.. కోర్టు ఉత్తర్వులను ఇన్నిసార్లు ధిక్కరించడం కరెక్ట్ కాదంది. తక్షణమే రంగనాథ్ ను కమిషనర్ పదవి నుంచి తప్పించి.. ఆయన స్థానంలో అర్హత కలిగిన ఆఫీసర్ ను హైడ్రా కమిషనర్ గా నియమించాలని కోర్టు చెప్పింది.
రంగారెడ్డి జిల్లా లోతుకుంట పరిధిలో సర్వే నెంబర్లు 1, 2లో 40 ఎకరాల భూమికి సంబంధించి కోర్టు ధిక్కరణ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఏవీ రంగనాథ్ తీరుపై తీవ్రంగా మండిపడింది. దీంతో లోతుకుంట భూముల వ్యవహారంలో క్షమాపణలు చెబుతూ అఫిడవిట్ దాఖలు చేశారు ఏవీ రంగనాథ్.
లోతుకుంటలోని సర్వే నెంబర్లు 1, 2కు సంబంధించి.. హైడ్రా అధికారులు చర్యలు తీసుకున్నారంటూ వివాదం మొదలైంది. సుమారు 40 ఎకరాల భూమికి సంబంధించిన ఈ వ్యవహారంలో.. హైడ్రా తమ భూముల్లోకి వచ్చి చర్యలు తీసుకుందని పిటిషనర్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా.. హైడ్రా చర్యలు, అధికారుల తీరుపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. కోర్టు ఆదేశాలు, న్యాయ ప్రక్రియకు సంబంధించి అధికారులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.
దీనిపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. కోర్టులు, న్యాయవ్యవస్థపై తనకు ఎంతో నమ్మకం ఉందని తెలిపారు. లోతుకుంటలోని సర్వే నెంబర్లు 1, 2లో ఉన్న 40 ఎకరాల భూమిలోకి హైడ్రా వెళ్లలేదని స్పష్టం చేశారు. ఎలాంటి కూల్చివేతలు చేపట్టలేదని స్పష్టం చేశారు. పిటిషనర్ కోర్టుకు అవాస్తవాలు చెప్పారని రంగనాథ్ తన అఫిడవిట్లో ఆరోపించారు.
ఈ వ్యవహారంలో గతంలో ఇచ్చిన వివరణలు, కోర్టు ముందు ప్రస్తావించిన అంశాలపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇదే సమయంలో.. రంగనాథ్పై ఏకంగా 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉండటాన్ని హైకోర్టు ప్రస్తావించింది. ఇన్ని పిటిషన్లు ఎందుకు దాఖలవుతున్నాయని ఆయనను ప్రశ్నించింది. హైడ్రా చర్యల విషయంలో పదేపదే కోర్టు వివాదాలు ఎందుకు తలెత్తుతున్నాయనే అంశంపై కూడా న్యాయస్థానం ఆరా తీసింది. దీంతో క్షమాపణలు చెబుతూ రంగనాథ్ అఫిడవిట్ దాఖలు చేశారు.
అసలేంటీ లోతుకుంట భూముల వ్యవహారం?
లోతుకుంటలో సర్వే నెంబర్ 1, 2లలోని భూమి ప్రైవేట్ దని, హైడ్రా ఆ భూముల్లోకి వెళ్లకూడదని హైకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. అయినా, హైడ్రా తమ భూముల విషయంలో జోక్యం చేసుకుందని, కోర్టు ధిక్కరణకు పాల్పడిందని పిటిషనర్ కోర్టును ఆశ్రయించారు. అయితే, ఆ భూముల్లోకి హైడ్రా వెళ్లలేదని, పిటిషనర్ అవాస్తవాలు చెబుతున్నారు అంటూ ఏవీ రంగనాథ్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలను తాము ధిక్కరించలేదని స్పష్టం చేశారు.












