యువత ఓట్లే లక్ష్యంగా సీఎం రేవంత్ ప్లాన్స్
బీజేపీ, బీఆర్ఎస్ను కార్నర్ చేసేలా వ్యూహాలు
21 ఏళ్లకే ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై తీర్మానం చేసే అవకాశం..?
దేశ రాజకీయాల్లో ఇప్పుడు మరో కొత్త చర్చ మొదలైంది. ప్రస్తుతం లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే కనీస వయసు 25 సంవత్సరాలు ఉండాలి. అయితే ఈ వయసును 21 సంవత్సరాలకు తగ్గించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రతిపాదన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. దీనిపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. ప్రతి పార్టీకి ఇప్పుడిదో సవాలే. సీఎం రేవంత్ ప్రతిపాదనను విమర్శించలేరు. అలాగని సమర్థించలేరు. ఇలా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను కార్నర్ చేసే ప్రయత్నం చేశారు రేవంత్.
రేవంత్ డిమాండ్ వెనుక అసలు ఉద్దేశం ఏమిటి..?
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన సందర్భంగా హైదరాబాద్లో భారీ ర్యాలీ తీసింది కాంగ్రెస్. ఈ సందర్భంలో సీఎం రేవంత్ అనూహ్యంగా ఈ వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి ఈ అంశంపై పార్టీలు తర్జన భర్జన పడుతూనే ఉనన్నాయి. అసలు సీఎం రేవంత్ వ్యాఖ్యల వెనుక లక్ష్యమేంటి..? కేవలం యువతకు అవకాశాలు కల్పించడానికేనా..? లేక దీని వెనుక మరో రాజకీయ వ్యూహం ఏమైనా దాగి ఉందా..?
ప్రస్తుతం భారతదేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉంటుంది. కానీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే మాత్రం 25 ఏళ్లు పూర్తి కావాలి. అంటే ఓటు వేయగలిగే యువకుడు, ప్రజల తరఫున పోటీ చేసే హక్కు పొందడానికి మరో ఏడు సంవత్సరాలు వేచి చూడాల్సిన పరిస్థితి. ఈ వ్యత్యాసాన్ని తొలగించాలని రేవంత్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు. యువతకు నాయకత్వ అవకాశాలు త్వరగా రావాలంటే పోటీ వయసును కూడా 21 ఏళ్లకు తగ్గించాలని ఆయన సూచిస్తున్నారు. యువత ఆలోచనలు అద్భుతంగా ఉంటున్నాయని, విద్యా సంస్కరణల కోసం కేంద్రానే కదిలించారని అభినందిస్తున్నారు ముఖ్యమంత్రి.
యువత ఓట్లే టార్గెట్
రేవంత్ రెడ్డి ఈ ప్రతిపాదన చేయడం వెనుక రాజకీయ కోణం కూడా ఉందనే విశ్లేషణ వినిపిస్తోంది. తెలంగాణలో యువ ఓటర్ల సంఖ్య ప్రతి ఎన్నికలో పెరుగుతోంది. ముఖ్యంగా 18 నుంచి 29 సంవత్సరాల మధ్య ఉన్న ఓటర్లు ఎన్నికల ఫలితాలపై గణనీయమైన ప్రభావం చూపే స్థాయికి చేరుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ గ్రూప్ ఎటు వైపు మొగ్గితే వాళ్లదే విజయం అన్నట్టుగా పరిస్థితి తయారైంది. జెన్ జీ ఉద్యమం జోరుగా సాగుతున్న ఇలాంటి సమయంలో యువతకు రాజకీయాల్లో ప్రత్యక్ష అవకాశాలు కల్పిస్తామని చెప్పడం ద్వారా కాంగ్రెస్ పార్టీ యువతకు మరింత దగ్గర కావాలనే ప్రయత్నం చేస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు విద్యార్థి రాజకీయాల్లో చురుకుగా పనిచేసే నాయకులకు కూడా ఇది పెద్ద అవకాశం అవుతుంది.
విశ్వవిద్యాలయాలు, విద్యార్థి సంఘాల నుంచి వచ్చిన నాయకులు ప్రస్తుతం 25 ఏళ్లు వచ్చే వరకు వేచి ఉండాల్సి వస్తోంది. వయసు 21 ఏళ్లకే తగ్గితే యువ నాయకత్వం మరింత వేగంగా రాజకీయాల్లోకి రావచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో 21 ఏళ్ల వయసులో రాజకీయ అనుభవం, పరిపక్వత, పరిపాలనపై అవగాహన ఎంతవరకు ఉంటుందనే ప్రశ్నను కొందరు లేవనెత్తుతున్నారు. వాస్తవానికి ఇవి పాత రోజులు కావు. యువత చాలా త్వరగా ఏ విషయాన్నైనా నేర్చుకుంటోంది. బీ టెక్ కంప్లీట్ చేసి బయటకు వస్తున్న విద్యార్థులు లక్షలకు లక్షలు ప్యాకేజీలు అందుకుంటున్నారంటే.. దీనర్థం ఏంటి..?
ప్రపంచంలోని కొన్ని ప్రజాస్వామ్య దేశాల్లో ఇప్పటికే తక్కువ వయసులోనే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. అయితే ప్రతి దేశం తన రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థకు అనుగుణంగా వయోపరిమితులను నిర్ణయించుకుంది. భారతదేశంలో ఈ మార్పు రావాలంటే రాజ్యాంగ, చట్టపరమైన సవరణలు అవసరం. అందుకు పార్లమెంట్ ఆమోదం తప్పనిసరి.
రాజకీయంగా చూస్తే...
యువతను ఆకర్షించడమే కాకుండా భవిష్యత్ నాయకత్వాన్ని కాంగ్రెస్ వైపు మళ్లించే ప్రయత్నంగా కూడా ఈ ప్రతిపాదనను కొందరు విశ్లేషిస్తున్నారు. దేశ జనాభాలో యువత శాతం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో యువ రాజకీయాలపై కొత్త చర్చకు రేవంత్ రెడ్డి తెరతీశారని చెప్పవచ్చు. 21 ఏళ్లకే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వాలా..? లేక ప్రస్తుత 25 ఏళ్ల పరిమితినే కొనసాగించాలా..? అనే అంశంపై ఇప్పుడే తుది నిర్ణయం లేకపోయినా... రేవంత్ రెడ్డి చేసిన ఈ ప్రతిపాదన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇది నిజంగా యువతకు రాజకీయ సాధికారత కల్పించే సంస్కరణగా మారుతుందా..? లేక రాజకీయ వ్యూహంగా మాత్రమే మిగిలిపోతుందా..? అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.












