ఆయుష్లో నిధుల గోల్మాల్
టెండర్లు లేకుండా మందుల కొనుగోళ్లు
నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు
Ayush Funds Misuse: ఆయుష్ విభాగంలో ప్రభుత్వ నిధుల దుర్వినియోగం జరిగినట్లు వచ్చిన ఫిర్యాదులపై తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. తెలంగాణ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ చేసిన ఫిర్యాదు, ముఖ్యమంత్రి కార్యాలయం ఎండార్స్మెంట్ ఆధారంగా ఆరోగ్య, వైద్య కుటుంబ సంక్షేమ శాఖ మెమో నెం.2653/E1/2025ను జారీ చేసింది. అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం ఈ అంశంపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయుష్ డైరెక్టర్ను ప్రభుత్వం కోరింది.
ఫోరం తన ఫిర్యాదులో నేషనల్ ఆయుష్ మిషన్ (NAM) నిధులతో సుమారు రూ.3.50 కోట్ల విలువైన ముడి, సంయోగ ఔషధాలను టెండర్ నోటిఫికేషన్ లేకుండా, నిపుణుల టెండర్ కమిటీ అనుమతి పొందకుండా రెండు సంస్థల నుంచి నేరుగా కొనుగోలు చేసినట్లు ఆరోపించింది. ప్రభుత్వం ఇప్పటికే జి.ఓ.ఆర్.టి. నం.288 (19-07-2024) ద్వారా టెండర్ కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ, ఆ నిబంధనలను పాటించలేదని పేర్కొంది.
అలాగే, కొనుగోలు చేసిన మందుల్లో సుమారు రూ.70 లక్షల విలువైన 'కర్పూర తైలం' నాణ్యత లేనిదిగా, అందులో 90 శాతం కొబ్బరి నూనె మాత్రమే ఉన్నట్లు గుర్తించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మందులు సరఫరా చేయకుండానే కొన్ని సంస్థలకు చెల్లింపులు జరిగినట్లు కూడా ఆరోపించారు.
ఈ వ్యవహారంలో అప్పటి అదనపు డైరెక్టర్ (ఆయుర్వేద) డా.ఎ.పరమేశ్వర్ నాయక్, డ్రగ్స్ ఇన్స్పెక్టర్ డా. వి.బాలకృష్ణ కీలక పాత్ర పోషించారని, వారు అప్పటి డైరెక్టర్ను తప్పుదోవ పట్టించి రూ.1.20 కోట్ల లంచం తీసుకున్నట్లు ఫోరం ఆరోపించింది. ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం కలిగించారని పేర్కొంటూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది.
దీనిపై స్పందించిన ప్రభుత్వం మార్చి ఏప్రిల్ 2024లో జరిగిన ఔషధాల కొనుగోళ్ల ఫైళ్లను పరిశీలించి, నిబంధనల ప్రకారం సమగ్ర విచారణ నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయుష్ డైరెక్టర్కు ఆదేశాలు జారీ చేసింది. కాగా సదరు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిపై గతంలో అనేక ఆరోపణలు వచ్చాయని, ఇప్పటికే వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం విజిలెన్స్ దర్యాప్తు పూర్తి చేసి సమగ్ర నివేదికను రూపొందించి ప్రభుత్వానికి అందజేసినట్లుగా తెలుస్తుంది.












